Home Blog Page 6

మోడీ ఎందుకంత పాపులర్ అయ్యాడో చెప్పిన న్యూయార్క్ టైమ్స్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం మొత్తం అటు వైపే చూస్తుంటుంది. సోషల్ మీడియాలో సుమారు 9 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు నిత్యం. భారత్ లోనే కాదు విదేశాల్లో కూడా మోడీపై విపరీతమైన అభిమానం కనిపిస్తూ ఉంటుంది. చాలా దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు మోడీ పాపులారిటీ చూసి ఆశ్చర్యపోతుంటారు. గతంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఏ ఒక్కరికీ ఇంత పాపులారిటీ రాలేదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్.. మోడీకి ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చింది అనే దానిపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. మోడీకి ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చిందో.. ప్రపంచ వ్యాప్తంగా భారత్ మరియు మోడీకి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఉన్నదో కథనంలో వివరించింది న్యూయార్క్ టైమ్స్.

ప్రధాని హోదాలో ఆయన భారత్ లో ప్రతి నెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఆయనకు పాపులారిటీ రావటానికి ప్రధాన కారణం అని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడటం.. ఆయన మాట్లాడే విధానంలో ఉండే వాక్చాతుర్యం.. ఎంచుకునే అంశం.. ఇలా ప్రతీదీ ఆయనకు ఉన్న ప్రజాదరణను పెంచేశాయట. డిజిటల్ పద్ధతులను, సోషల్ మీడియాను మోడీ ఆండ్ టీమ్ వాడుకునే పద్ధతి కూడా ఇంత పాపులారిటీ రావటానికి కారణమయ్యాయట. భారతదేశంలో జరిగే అన్ని పరిణామాలపై మోడీకి చాలా లోతైన అవగాహన ఉంటుందంటూ రాసుకొచ్చింది న్యూయార్క్ టైమ్స్. భారతదేశాన్ని ప్రపంచంతో మోడీ కనెక్ట్ చేసిన విధానం మరియు ప్రపంచ దేశాలతో భారత్ కు మోడీ ఇచ్చిన అత్యంత అద్భుతమైన విదేశాంగ విధానం.. భారత్ పేరు మారుమోగి పోయేలా చేయటం.. ఇలా చాలా అంశాలు మోడీని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా నిలబెట్టాయట.
రాహుల్ గాంధీ లాంటి నేతలు అమెరికా పర్యటనలో మోడీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన నేపథ్యంలో.. అమెరికా వార్తా సంస్థలు ఇలాంటి కథనాలు ప్రచరించటం గమనార్హం. మోడీ అమెరికా పర్యటనకు ముందే అమెరికాలో వివిధ ప్రదేశాల్లో మీటింగులతో ఊదరగొట్టిన రాహుల్.. భారత్ పరిస్థితి దిగజారిందనీ.. మోడీ పాలన బాగాలేదనీ.. ఇలా చాలా మాటలే మాట్లాడాడు. కానీ ఆ మాటలు ఎక్కడా ప్రభావం చూపలేకపోయాయి. పనిగట్టుకొని మోడీ పై దుష్ప్రచారం చేసినప్పటికీ పాపం రాహుల్ ఆండ్ టీమ్ కు చుక్కెదురైంది. ప్రస్తుతం మోడీకి ఉన్న పాపులారిటీ అనేది ఓ హాట్ టాపిక్.. టాక్ ఆఫ్ ది వరల్డ్..!!

భారత్ తో “గ్రేట్ డీల్” కు ఒప్పుకున్న అమెరికా

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ముందే ఊహించినట్టుగానే మోడీ పర్యటనలో భారత్-అమెరికా చరిత్రలోనే ఇప్పటి వరకూ సాధ్యం కాని ఎన్నో ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి. భారత్-అమెరికా దౌత్య అధికారులు కలిసి కొన్ని వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయగా.. మోడీ-బైడెన్ సమావేశంలో చారిత్రక ఒప్పందాలు కార్యరూపం దాల్చనున్నాయి. జెట్ ఇంజన్ల తయారీ ఒప్పందం అన్నింటికంటే కీలకం కానుంది. ఈ ఒప్పందం పూర్తి అయితే భారత్ స్థాయి వంద మెట్లు పైకెక్కినట్టే. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ నాలుగు దేశాల వద్ద మాత్రమే ఉన్న జెట్ ఇంజన్ తయారీ టెక్నాలజీ భారత్ కు లభిస్తుంది. ఇదే జరిగితే ప్రపంచంలో అత్యంత వైమానిక దళం కలిగిన ఐదో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటి వరకూ జెట్ ఇంజన్ తయారీ టెక్నాలజీని భారత్ కు అందించేందుకు ఏ దేశం కూడా అంగీకరించలేదు. కావాలంటే జెట్ ఇంజన్లు తయారు చేసి ఇస్తామే తప్ప టెక్నాలజీని బదలాయించటానికి కుదరదని పై నాలుగు దేశాలు తేల్చి చెప్పాయి. కానీ ఇప్పుడు అమెరికా మాత్రం జెట్ ఇంజన్ల తయారీ టెక్నాలజీని భారత్ ఇవ్వటమే కాకుండా భారత్ లోనే జెట్ ఇంజన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.

జీఈ-ఎఫ్-414 జెట్ ఇంజన్లు ఇకపై భారత్ లో తయారు కానున్నాయి. అయితే.. చాలా యేళ్ళ క్రితం నుంచే భారత్ లో జెట్ ఇంజన్ల తయారీకి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేసినప్పటికీ భారత్ ఈ మైలురాయిని చేరుకోలేకపోయింది. 1986 నుంటి భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి పేరిట జెట్ ఇంజన్ల తయారీ కోసం ప్రయత్నిస్తున్నా అది నెరవేరలేదు. ఇప్పుడు భారత్-అమెరికా మధ్య ఒప్పందంతో భారత్ లో ఎఫ్414 యుద్ధ విమానాల జెట్ ఇంజన్లు తయారీ జరగనుంది. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్టు స్వీకరించనుంది. ఇదే జరిగితే భారత్ లో వేలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.

యుద్ధం అంటూ జరిగితే అందులో యుద్ధ విమానాలదే కీలకమైన పాత్ర. యుద్ధ ట్యాంకర్లు లేదా ఆర్మీ చేయలేని పనిని యుద్ధ విమానాలు చేస్తాయి. గాలిలో ఎగురుతూ శతృవుపై భీకర దాడి చేసి సర్వనాశక విధ్వంసం సృష్టించగలవు యుద్ధ విమానాలు. క్షణాల్లో శతృదేశ ఆర్మీ శిబిరాలను, ఆయుధాగారాలను బూడిద చేయవచ్చు. గాలిలో నుంచి మిసైల్ లాంచ్ చేయగల యుద్ధ విమానాలు.. వేల కిలో మీటర్లను నిముషాల్లో ప్రయాణించి శతృవును నిర్వీర్యం చేయగలవు. అత్యాధునిక యుద్ధ విమానాలు ఎవరి దగ్గర ఉంటే యుద్ధంలో విజయం వారిదే. అందుకే భారత్ రఫేల్ యుద్ధ విమానాల కోసం అంతగా ఖర్చు చేసింది. ఫైటర్ జెట్ విమానాల తయారీ కనుక భారత్ లో జరిగితే.. అంతర్జాతీయ యుద్ధ విమానాల వ్యాపారంలో భారత్ రారాజుగా వెలుగొందనుంది. యుద్ధ విమానాల ఇంజన్లు తయారీ టెక్నాలజీ ఏ దేశం వద్ద ఉంటుందో ఆ దేశాన్ని యుద్ధంలో ఓడించటం దాదాపు అసాధ్యం. అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఏ దేశం కూడా భారత్ తో ఈ టెక్నాలజీని పంచుకోటానికి అంగీకరించలేదు. ఈ ఒప్పందం ఇంత కీలకం కనుకనే.. మోడీ అమెరికా పర్యటనను ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తితో గమనిస్తున్నాయి. భారత్ ను అమెరికా వాడుకుంటున్నది అంటూ చైనా వ్యాఖ్యానించటం వెనుక ఉన్నది.. ఈ కడుపు మంట మాత్రమే. ఇప్పుడు చైనా భారత్ పై ఆక్రమణ ప్రయత్నం చేసే ధైర్యం చేయలేదు. ఇంకా మోడీ పర్యటనలో చాలా కీలక ఒప్పందాలు జరగనున్నాయి.. అయితే.. అవి ఏమిటనేది ప్రస్తుతానికి పూర్తి సమాచారం లేదు.

ఓషియన్ గేట్ సబ్ మెరైన్ : ఆ ఐదుగురు బ్రతకటం కష్టం

సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ శకలాలను చూడటానికి వెళ్ళిన ఓషియన్ గేట్ సబ్ మెరైన్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు పోయినట్టే. సబ్ మెరైన్ లో ఐదుగురికి కలిపి గురువారం ఉదయం దాకా సరిపోయేంత ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఓషియన్ గేట్ సంస్థ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన గురువారం ఉదయం కల్లా సబ్ మెరైన్ ఆచూకీ లభించని పక్షంలో వారు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు. ఇప్పటికే అమెరికా నావికా దళానికి చెందిన నిపుణుల బృందాలు సముద్రం మొత్తం జల్లెడ వేసి గాలిస్తున్నాయి. అయినా ఓషియన్ గేట్ గురించి చిన్న సమాచారం కూడా సేకరించలేకపోయాయి. అప్పుడప్పుడు సముద్రం నుంచి కొన్ని శబ్ధాలు వస్తున్నాయనీ.. ఆ శబ్దాలు ఓషియన్ గేట్ సబ్ మెరైన్ నుంచే వెలువడుతున్నాయని తాము భావిస్తున్నామనీ.. కానీ దానిని చేరుకోలేకపోతున్నామనీ అమెరికా నేవీ ప్రకటించింది.

పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ తో పాటు యాత్ర నిర్వాహకుడు మరియు ఓషియన్ గేట్ సంస్థ ఓనర్ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నేవీ ఆఫిసర్ పాల్ హెన్రీ ఓషియన్ గేట్ సబ్ మెరైన్ లో ఉన్నారు. కెనడా, అమెరికా నేవీకి సంబంధించిన నిపుణుల బృందాలు సముద్రం మొత్తం గాలిస్తున్నా ఆచూకీ మాత్రం లభించటం లేదు. సబ్ మెరైన్ ఒక్కసారి అదుపుతప్పితే అది వెళ్ళే మార్గం కనుక్కోవటం కష్టం. నావిగేషన్ గనుక మిస్ గైడ్ అయితే అది అదుపుతప్పి సముద్రజలాల్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే.. అసలు సబ్ మెరైన్ ఎలా అదుపుతప్పింది.. సముద్రం లోతున ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటి వరకూ ఓషియన్ గేట్ అధికారులు వెల్లడించటం లేదు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని అమెరికా అధికారులు టెన్షన్ పడుతున్నారు. అందులో ఉన్న వాళ్ళు మాత్రం ప్రాణాలతో ఉండే అవకాశం ఒక్క శాతం కూడా లేవని నిపుణులు చెప్తున్నారు.

ప్రధాని మోడీ వద్దకు ఆదిపురుష్ పంచాయతీ

0

ఆదిపురుష్ సినిమాపై ఏ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తున్నదో రోజూ చూస్తూనే ఉన్నాం. డైరెక్టర్ ఓం రౌత్ ను మాత్రం జనాలు మామూలుగా తిట్టడం లేదు. ఇక హిందూ సంఘాల గురించి చెప్పాల్సిన పనే లేదు. కొన్ని సంఘాల వాళ్ళు ఆదిపురుష్ సినిమా బ్యాన్ చేయాలంటూ కోర్టుల్లో కేసులు వేస్తే.. మరి కొంత మంది ఆదిపురుష్ లోని చాలా సీన్లు మార్చాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఆదిపురుష్ సినిమా పట్ల నూటికి నూరు శాతం సంతృప్తితో ఉన్నది మాత్రం ఒక్కరు కూడా లేరు.. ఒక్క ఓం రౌత్ తప్ప. ఎవడెన్ని తిడితే మాత్రం ఏముంది.. ముందు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలనేది సినిమా యూనిట్ తాపత్రయంగా కనిపిస్తోంది. రామాయణం అనేది ఓ అద్భుతమనీ.. అది పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఊ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరనీ.. తనకు అర్థమైన యుద్ధకాండను మాత్రమే తాను సినిమాగా తీశానంటూ తాజాగా ఓం రౌత్ చేసిన కామెంట్లు జనాానికి విపరీతమైన కోపం తెప్పిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషిర్ అనే ఘనుడు తాము అసలు రామాయణం తీయనే లేదనీ..

రామాయణం స్ఫూర్తిగా తాము కొత్త కథ రాసుకొని దాన్ని మాత్రమే తెరకెక్కించామనీ చెప్పి జనానికి ఎక్కడో కాలేలా చేశాడు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా పంచాయతీ ప్రధాని మోడీ వద్దకు చేరనుంది. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ అనే సంఘం వాళ్ళు ఆదిపురుష్ సినిమాను వెంటనే థియేటర్ల నుంచి తొలగించటమే కాకుండా ఎక్కడా ఎవ్వరూ చూడకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా ఆదిపురుష్ స్ట్రీమింగ్ కాకుండా నిషేధం విధించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము నేరుగా ప్రధానమంత్రి మోడీని కలిసి ఆదిపురుష్ సినిమాపై కంప్లైంట్ ఇస్తామని చెప్పటం గమనార్హం. రామాయణం ప్రాశస్త్యాన్ని, శ్రీరాముడి గొప్పతనాన్ని ఆదిపురుష్ సినిమా నాశనం చేసి ప్రపంచం ముందు పరువు తీసిందని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఈ సినిమాలో వాడిన డైలాగ్స్ చాలా దారుణంగా ఉన్నాయనీ.. కేవలం హిందూధర్మాన్ని నాశనం చేసి ప్రపంచం ముందు శ్రీరాముడిని కించపరచటానికే ఆదిపురుష్ సినిమా తీశారని ఆరోపిస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రధాని మోడీని కలిసి ఫిర్యాదు చేయటం మాత్రం తప్పదని హెచ్చరిస్తున్నారు.

“10 సినిమాల తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై” లోకేష్ కనకరాజ్

0

ఖైదీ సినిమాతో ఊహించని బ్లాక్ బస్టర్ ఇచ్చి విక్రమ్ సినిమాతో కోలీవుడ్ పై కాసుల వర్షం కురిపించి క్రేజీ డైరెక్టర్ గా మారాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఖైదీ సినిమాకూ విక్రమ్ సినిమాకు లింక్ పెట్టి లోకేష్ మల్టీవర్స్ అంటూ కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. తను చేసే సినిమాలన్నీ ఈ మల్డీవర్స్ కు సంబంధించినవే ఉంటాయనీ.. సిరీస్ రూపంలో సినిమాలు వస్తాయనీ చెప్పాడు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్ తో లియో సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు లోకేష్ కశ్మీర్ లో ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా చెన్నైలోనే షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్.. తాను త్వరలోనే సినిమాలు చేయటం ఆపేస్తానంటూ చేసిన కామెంట్ తమిళ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మల్టీ వర్స్ లో మొత్తం 10 సినిమాలు చేస్తాననీ.. 10 సినిమాలు పూర్తైన తర్వాత ఇక సినిమాలు చేయటం ఆపేస్తానంటూ లోకేష్ చేసిన కామెంట్లు అభిమానులకు పెద్ద షాకిచ్చాయి.

“మొదట షార్ట్ ఫిల్మ్స్ చేశాను.. ఆ తర్వాత సినిమాపై పట్టు దొరికిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాను.. ఈ ప్రయాణం ఎంతో పెద్దగా ఉండదు.. నేను శాశ్వతంగా సినిమాలు చేస్తూనే ఉండాలని కోరుకోవటం లేదు.. మల్టీవర్స్ లో 10 సినిమాలు వస్తాయేమో చూద్దాం.. 10 సినిమాల తర్వాత ఇండస్ట్రీలో ఉండాలని మాత్రం నేను కోరుకోవటం లేదు..” అంటూ లోకేష్ మాట్లాడాడు. లోకేష్ మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం లియో చేస్తున్న లోకేష్.. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు ఒప్పుకొని బిజీగా ఉన్నాడు. వచ్చే అక్టోబర్ లో విజయ్ లియో విడుదల చేస్తామని చెప్పారు. ఇక మిగతా సినిమాలు పూర్తయ్యే సరికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. తెలుగులో ప్రభాస్ తో కూడా లోకేష్ ఓ సినిమా ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి.. కానీ ఎంత వరకు నిజమో తెలియదు.

“నా ఆఫీస్ ముందు మజ్జిగ పంచుతున్నా” : తమన్ ట్వీట్ వైరల్

0

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. తరచూ ట్రోలింగ్ కు గురవుతూ ఉంటాడు. తమన్ నుంచి ఏ కొత్త మ్యూజిక్ ట్రాక్ వచ్చినా అది కాపీ చేసిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించటం మామూలైపోయింది. తమన్ ఇచ్చిన ట్రాక్ దేని నుంచి కాపీ చేశారోనని జనం వెతికి వెతికి మరీ ఒరిజినల్ ట్రాక్ సంపాదించి దాన్ని పాపులర్ చేసి తమన్ ను ట్రోల్ చేస్తుంటారు. తమన్ కు సంబంధించిన చాలా పాటల విషయంలో ఇది జరిగింది. తమన్ ఆ పాటలకు కాపీ కొట్టాడా లేక యాధృచ్ఛికంగా వాటి మధ్య పోలికలు ఉన్నాయా అనేది అర్థం కాని విషయం. కానీ జనాలు మాత్రం తమన్ బ్రో మళ్ళీ కాపీ కొట్టేశాడనే ఊదరగొట్టేస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా తమన్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం ప్రాజెక్టు నుంచి తమన్ ను తప్పించేశారనేది ఆ పోస్ట్ సారాంశం. రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమా గ్లింప్స్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఉన్న మ్యూజిక్ ఓ ఇంగ్లిష్ సినిమా నుంచి తమన్ కాపీ చేశాడంటూ ట్రోలర్స్ మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇలా తమన్ ను వరుసగా జనాలు ఆడిపోసుకుంటుంటే.. ఒక్కసారైన స్పందించని తమన్.. ఈ సారి మాత్రం ట్వీట్ ద్వారా స్పందించాడు.

నా ఆఫీస్ దగ్గర మజ్జిగ పంచిపెడుతున్నాను.. కడుపు మంటకు ఇది చాలా బాగా పని చేస్తుంది.. మజ్జిగ, అరటిపండు కడుపు మంటకు బాగా పనిచేస్తాయి.. అంటూ ట్వీట్ చేశాడు తమన్. తనను విమర్శించే వాళ్ళకు కౌంటర్ గా తమన్ ఈ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది. తమన్ చేసిన ఈ ట్వీట్ ట్విటర్ లో ట్రెండ్ అవుతోంది. గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ను తీసేశారన్న వార్తలు నిజం కాదని ఈ ట్వీట్ తో తెలుస్తోంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో మూడో సినిమాగా గుంటూరు కారం సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన శ్రీలీల, పూజా హెగ్డే నటించబోతున్నట్టు సినిమా యూనిట్ చెప్పింది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

భారత్ కీలక నిర్ణయం : “రా” చీఫ్ గా రవి సిన్హా

0

భారత నిఘా విభాగం రీసెర్చ్ ఆండ్ అనాలసిస్ వింగ్(రా) అధిపతిగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. 1988 బ్యాచ్ కు చెందిన రవి సిన్హా చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన అధికారి. ప్రస్తుతం క్యాబినెట్ స్పెషల్ సెక్రెటరీ పదవి తో పాటు రా లోనే ఆపరేషన్స్ వింగ్ కు చీఫ్ గా రవి సిన్హా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రా చీఫ్ గా వ్యవహరిస్తున్న సుమంత్ కుమార్ గోయల్ జూన్ 30న రిటైర్ కాబోతున్నారు. అయితే.. గోయల్ ఇదివరకే రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆయన పదవీ కాలం 3 సార్లు పొడగించారు. ఈ సారి మాత్రం పదవీ కాలాన్ని పొడగించకుండా రా కు రవి సిన్హాను చీఫ్ గా నియమిస్తూ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రవి సిన్హా రా చీఫ్ గా రెండేళ్ళ పాటు పదవిలో ఉండనున్నారు. రెండు దశాబ్ధాలకు పైగా నిఘా విభాగంలో పని చేస్తున్నాడు రవి సిన్హా.

రా లో జరిగే ప్రతి చిన్న అంతర్గత విషయాలపైన రవి సిన్హాకు మంచి పట్టు ఉందని చెప్తారు. అంతర్గతంగా సున్నితమైన అంశాలపై ఎలా వ్యవహరించాలో రవి సిన్హాకు చాలా బాగా తెలుసని కూడా చెప్తారు. భారత సరిహద్దు దేశాల్లో జరిగే అంతర్గత విషయాలతో పాటు కశ్మీర్, ఈశాన్య భారత దేశ ప్రాంతాల్లో జరిగే రహస్య కార్యకలాపాల గురించి కూడా రవి వద్ద మంచి సమాచారం ఉంటుందట. రా కోసం రహస్యంగా వివిధ ఐడెంటిటీలతో విదేశాల్లో పని చేసే ఏజెంట్లు చాలా మంది ఉంటారు. వారికి సంబంధించిన విషయాలు కొన్ని సార్లు రా వద్ద కూడా ఉండవు. వారిని నియమించిన వారికి మాత్రమే అలాంటి విషయాలు తెలుస్తాయి. ఆ ఏజెంట్లు కూడా వాళ్ళు సేకరించిన సమాచారాన్ని వారిని నియమించిన వారికి మాత్రమే అందజేస్తారు. భారత్ కు కావాల్సిన రహస్య సమాచారాన్ని సేకరించటంలోనూ.. సమాచారాన్ని విశ్లేషించటంలోనూ మేధావులైన అధికారులకు మాత్రమే రా లో స్థానం ఉంటుంది. అయితే.. రవి సిన్హా గురించి ఎక్కడా పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. ప్రభుత్వం కూడా రవి సిన్హా గురించి చాలా వివరాలు గోప్యంగానే ఉంచింది.

ప్రతి దేశానికీ నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది. అమెరికాకు సీఐఏ.. పాకిస్తాన్ కు ఐఎస్ఐ.. ఇజ్రాయెల్ కు మొస్సాద్.. రష్యాకు కేజీబీ.. ఇలానే భారత్ కు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. ఈ నిఘా సంస్థలు పని చేసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. అంతర్గత రహస్య సమాచారం కోసం ఈ నిఘా సంస్థలో పనిచేసే ఏజెంట్లు నిత్యం పనిచేస్తూనే ఉంటారు.. వారి పై అధికారులతో సమాచారాన్ని పంచుకోవటంతో పాటు.. కొన్ని సార్లు మిగతా దేశాల నిఘా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా బలమైన నిఘా వ్యవస్థగా ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ కు పేరుంది. అమెరికా, రష్యా నిఘా సంస్థలను కూడా మించిపోయిన మొసాద్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్రగ్, వెపన్ మాఫియాను కూడా కంట్రోల్ చేయగలిగేంత స్థాయిలో బలంగా ఉంది.

వైరల్ : జెలెన్ స్కీకి ఇండియన్ బర్ఫీ తినిపించిన రుషి సునక్

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ కి బ్రిటన్ ప్రధానమంత్రి రుషి సునక్ ఇండియన్ బర్ఫీని తినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రుషీ తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా.. ప్రస్తుతం వరల్డ్ న్యూస్ లో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. జెలెన్ స్కీకి రుషీ స్వీట్ తినిపించటాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. రుషీ ఫ్యామిలీ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు.. భారతీయులు ఎక్కడ ఉన్నా ఇలానే ఉంటారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో గురించి ఓ ఇంటర్వ్యూలో రుషి క్లియర్ గా చెప్పాడు. కొద్ది రోజుల క్రితం తమ ఇద్దరి మధ్య ఓ సమావేశం జరిగిందనీ.. జెలెన్ స్కీతో మాట్లాడుతున్న సమయంలో అతడు ఆకలితో ఉన్నట్టు అనిపించి తన వద్ద ఉన్న బర్ఫీని ఆయనకు ఇచ్చాననీ చెప్పారు రుషీ. తన తల్లి గారు భారతీయ స్వీట్లను ఇంట్లోనే చేస్తుంటుందనీ.. అవి చాలా రుచికరంగా ఉంటాయనీ చెప్పాడు రుషీ. స్వీట్ తిన్న జెలెన్ స్కీ ఆ స్వీట్ గురించి అడిగి తెలుసుకొని చాలా బాగుందని మెచ్చుకున్నాడని కూడా రుషీ చెప్పాడు. ఈ విషయం తెలిసిన రుషీ తల్లి ఎంతో సంతోషించిందట.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చంపేస్తామంటూ రష్యా ఆర్మీ క్లియర్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉక్రెయిన్ లో ఉండటం సేఫ్ కాదని భావించిన జెలెన్ స్కీ యూరప్ దేశాల అండదండలతో దేశం విడిచి ఎక్కడో రహస్యంగా దాక్కొని యుద్ధాన్ని నడిపిస్తున్నాడు. తమకు సాయం కావాలంటూ వీలైనప్పుడల్లా విదేశాలకు వెళ్తూ ఆయా దేశాల ప్రధాన మంత్రులతో సమావేశమవుతున్నాడు. ఈక్రమంలోనే జెలెన్ స్కీ బ్రిటన్ ప్రధానమంత్రి రుషి సునక్ తో సమావేశమయ్యాడు. కొద్ది రోజల క్రితం భారత ప్రధానమంత్రి మోడీతో సమావేశమైన జెలెన్ స్కీ.. తమకు ఆర్థిక, ఆయుధ సాయం చేయాలని కోరటంతో పాటు పుతిన్ ను యుద్ధం ఆపేలా ఒప్పించాలంటూ కోరిన విషయం తెలిసిందే.

నేను ఉరి వేసుకుంటా.. రేవంత్ రెడ్డికి జోగు రామన్న చాలెంజ్

0

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను ఉరి వేసుకుంటా.. రాకపోతే నువ్వు ఉరి వేసుకుంటావా రేవంత్ రెడ్డి.. అంటూ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రేవంత్ రెడ్డిని చాలెంజ్ చేశాడు. ఆదిలాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జోగు రామన్న.. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ గురించి గానీ కేటీఆర్ గురించి గానీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి.. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా అంటూ సవాల్ చేశాడు జోగు రామన్న.

జోగు రామన్న వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు. జోగు రామన్న మాట మీద నిలబడి చావటానికి సిద్ధంగా ఉండాలనీ.. ఎందుకంటే వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేననీ చెప్పాడు సాజిద్ ఖాన్. ఓట్ల కోసం జోగు రామన్న జనం దగ్గరికి వెళ్ళినప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకే అర్థం అవుతుందంటూ జోష్యం చెప్పాడు సాజిద్ ఖాన్. వచ్చే సారి తాను ఓడిపోతానన్న విషయం తెలిసే భయంతో జోగు రామన్న పిచ్చి పిచ్చి చాలెంజ్ లు చేస్తున్నాడంటూ విమర్శించాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు మరోసారి తెలంగాణలో రాజకీయాన్ని వేడెక్కించాయి.

జనానికి కోపం తెప్పిస్తున్న ఔం రౌత్ కామెంట్లు

0

500 కోట్లు ఖర్చు పెట్టి ఇదా నువ్వు తీసిన సినిమా అంటూ జనాలు ఓ వైపు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై విరుచుకుపడుతుంటే.. అతడు మాత్రం తాపీగానే ఉన్నట్టు కనిపిస్తోంది. రామాయణాన్ని తనకు ఇష్టమొచ్చినట్టు మార్చేసి అర్థం పర్థం లేని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు ఎక్కడో మండేలా చేసిన ఇతడు.. డైరెక్టర్ నితేష్ త్వరలో మొదలు పెట్టనున్న రామాయణం ప్రాజెక్టుపై ఎంతో ఆసక్తితో ఉన్నాననీ.. తన లాంటి రామ భక్తులంతా రామాయణాన్ని ఎన్ని సార్లైనా చూసేందుకు ఇష్టపడతారనీ వ్యాఖ్యానించాడు. తనను తాను రామభక్తుడిని అని చెప్పుకోవటం పట్ల జనాలు మరోసారి భగ్గుమన్నారు. “సినిమాలో ఒక్క క్యారెక్టర్ కూడా జస్టిఫికేషన్ కనిపించలేదు.. కనీసం శ్రీరాముడి పాత్రను కూడా అవెంజర్స్ హీరో లాగా చూపించి నాశనం చేశాడు” ఓం రౌత్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. అవెంజర్స్, అవతార్ లాంటి సిరీస్ లు రామాయణాన్ని, మహాభారతాన్ని బేస్ చేసుకొని తీస్తే.. ఓం రౌత్ మాత్రం రామాయణాన్ని అవెంజర్స్ లా చూపించాడట.
సోషల్ మీడియాలో ఈ పోలిక ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆదిపురుష్ లో చూపించిన లంక.. థోర్ సినిమాలోని ఆస్గార్డ్ కు కాపీలా ఉంది. అలాగే ఆదిపురుష్ లో చూపించిన రాక్షసుల క్యారెక్టర్లు అన్నీ అవెంజర్స్ సినిమాల్లో కనిపించే వాటిలాగానే డిజైన్ చేశాడు ఓం రౌత్.. కాదు కాదు కాపీ చేశాడు. ఇదొక్కటే కాదు.. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లోని క్యారెక్టర్లన్నీ కలిపి చిత్రవిచిత్రమైన మార్పులు చేసి వాటిని ఆదిపురుష్ లో చూపించేశాడు ఈ డైరెక్టర్. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచమంతా భారత ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని సినిమాలు రాసుకుంటున్నారు. ఓం రౌత్ మాత్రం అలా రాసుకుని ఇంగ్లిష్ లో తెరకెక్కించిన సినిమాలను మళ్ళీ కాపీ కొట్టి ఇండియన్ సినిమా అంటున్నాడు. ఇన్ని విమర్శలు వస్తున్నా, ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా ఓం రౌత్ మాత్రం హ్యాప్పీగా మిగతా డైరెక్టర్ల సినిమాల గురించి ఎదురు చూస్తున్నానంటూ రిలాక్స్ అవుతున్నాడు. రెండో రోజు నుంచే కలెక్షన్లు డల్ అయిపోగా.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మరి.