HomeINTERNATIONAL NEWSభారత్ నీటిని ఆపేస్తే ఎలా..? : వణుకుతున్న పాకిస్తాన్

భారత్ నీటిని ఆపేస్తే ఎలా..? : వణుకుతున్న పాకిస్తాన్

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

ఆర్ధిక మాంద్యం, ఆకలి చావులకుతోడు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితే వస్తే? పాకిస్తాన్‌ వెన్ను లో వణుకు పుట్టిస్తున్న అంశం ఇప్పుడిదే. గతేడాది తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి వెల్‌కమ్ చెప్పిన పాకిస్తాన్ ఈ ఏడాది మొదట్లోనే ప్రజల ఆకలి తీర్చడంలో చేతులెత్తేసింది. ఇప్పుడా దేశంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలూ, కడుపు కాలిన మరణాలే. మూడు పూటలా తిండి తొరికే పరిస్థితి లేదు. కంటినిండా నిద్రపోయే అవకాశం లేదు. చేద్దామంటే పనుండదు.. ఉంటే జీతం చేతికందే ఛాన్స్ ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే భూమ్మీద ప్రత్యక్ష నరకంగా పాకిస్తాన్ మారిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ దేశానికి అసలు చిక్కొచ్చి పడింది. దశాబ్దాలుగా ఇండియా-పాక్ మధ్య ఎడతెగని వివాదంగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పం దంపై చర్చకొస్తారా? కాదని మొండికేసి ఇబ్బందులు కొనితెచ్చుకుంటారా? అంటూ ఇండియా గేర్ మార్చింది.
ప్ర‌పంచంలోని పెద్ద న‌దీ ఒప్పందాల్లో సింధు న‌దీ ఒప్పందం ఒక‌టి. ఈ న‌ది ప‌రివాహ‌క ప్రాంతం దాదాపు 11.2 ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు. ఈ న‌ది పాకిస్థాన్‌లో 47 శాతం ప్ర‌వ‌హిస్తుండ‌గా.. భార‌త్‌లో 39 శాతం, చైనాలో 8 శాతం, అఫ్గానిస్తాన్‌లో 6 శాతం ప్రవహిస్తోంది. ఈ న‌దీ ప‌రివాక ప్రాంతంలో దాదాపు 30 కోట్ల మంది నివ‌సిస్తున్నారని అంచ‌నా. ఈ న‌దీ జ‌లాల‌ను ఎవ‌రెవ‌రు ఎలా ఉప‌యోగించాల‌నే విష‌య‌మై, 62 సంవ‌త్స‌రాల క్రితం ఒప్పందాలు జ‌రిగాయి. 1960లో కుదిరిన ఈ ఒప్పందాన్ని పాక్ చాలా సందర్భాల్లో ఉల్లంఘిస్తూనే వచ్చింది. ఇన్నేళ్లూ మౌనంగా సహించిన భారత్, ఇక పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధపడింది. ఈ ఏడాది జనవరి చివర్లో ఒప్పందంలోని పన్నెండో ఆర్టికల్ కింద పాకిస్తాన్‌కు నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్‌కు పాకిస్తాన్ 90 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ నుంచి ఆ స్పందన రానేవచ్చింది. ఇండియా ఇచ్చిన నోటీస్‌పై స్పందించిన పాక్.. ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. భారత్‌ సైతం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పినదాని ప్రకారం. ఈ ఏడాది జనవరిలో ఇండియా ఇచ్చిన నోటీస్‌కు బదులుగా పాకిస్తాన్ ఓ లేఖ పంపించింది. ప్రస్తుతం ఆ లేఖను పరిశీలిస్తున్నట్టు అరిందమ్ బాగ్చి స్పష్టతనిచ్చారు. ఇదే సమయంలో ఆ లేఖపై పాకిస్తాన్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. సింధు జలాల ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ తెలిపినట్టు పీటీఐ తెలిపింది. అలాగే, సింధు జలాల ఒప్పందంలోని ఆర్టికల్ 12 ప్రకారం ద్వైపాక్షికంగా సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకునే వరకు ప్రస్తుత ఒప్పందం కొనసాగుతుందని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపినట్టు అక్కడి మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సింధు జలాల ఒప్పందంపై చర్చకు నో చెబుతూ వచ్చిన పాకిస్తాన్.. తాజాగా పాజిటివ్‌గా స్పందించడంతో సింధు జలాల ఒప్పందంలో మార్పలు, చేర్పులకు ఓకే చెప్పినట్టే అనే చర్చ జరుగుతోంది.
నిజానికి.. భారత్, పాక్‌ మధ్య సింధూ నదీజలాల ఒప్పందం కుదర్చడంలో ప్రపంచ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. ఈ ఒప్పందం కింద ఒక ప్రతినిధి బృందం రెండు దేశాల్లోనూ పర్యటిస్తుంది. పరస్పరం సహకరించుకోవాల్సిన అంశాలను చర్చిస్తుంది. ఈ విషయంలో పాక్ అనుసరించిన ధోరణి భారత్‌కు ఆగ్రహం తెప్పించింది. భారత్ కొన్నేళ్ల క్రితం కిషన్ గంగ, రాల్లె హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను నిర్మించింది. వీటి విషయంలో పాకిస్తాన్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తటస్థ నిపుణిడి నియామకం కోసం 2015లో ఓ అభ్యర్థన చేసింది. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకుని తన అభ్యంతరాలను పరిశీలించేందుకు మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయడాన్ని ప్రతిపాదించింది. భారత్ మాత్రం ఈ అంశాన్ని తటస్థ నిపుణుడికి రెఫర్ చేయాల్సిందిగా ప్రపంచబ్యాంకును కోరింది. పాకిస్తాన్ ఏకకాలంలో రెండు రకాల ప్రక్రియలకు ప్రయత్నించడాన్ని ప్రపంచబ్యాంక్ గుర్తించింది. తన నిర్ణయానికి బ్రేక్ వేసింది. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా రెండు దేశాలకూ సూచించింది.
మరోవైపు.. సింధూ జలాల ఒప్పందం విషయంలో ప్రపంచబ్యాంకు చేసిన సూచనకు భారత్ సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్ మాత్రం ఎప్పట్లానే మొండి వైఖరిని అనుసరించింది. 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల కాలంలో ఐదుసార్లు జరిగిన సమావేశాల్లో ఆయా అంశాలను చర్చించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచబ్యాంకు మళ్లీ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ అభ్యర్థించిన విధంగా తటస్థ నిపుణుడి నియమించే విషయంలోనూ, సేమ్ టైం మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియపై కూడా చర్యలకు శ్రీకారం చుట్టింది. కానీ, ఒకే అంశంపై రెండు రకాల సమాంతర ప్రక్రియలపై చర్యలు తీసుకోవడాన్ని భారత్ తప్పుబట్టింది. అలాంటి దానికి ఒప్పందంలో స్థానం లేదనే అంశాన్ని స్పష్టం చేసింది. అలాగే ఒప్పందంలో మార్పులకు వీలు కల్పించేలా పాకిస్తాన్‌కు నోటీస్ కూడా జారీ చేసింది. అసలే ఆర్ధిక ఇబ్బందులు చుట్టు ముట్టిన వేళ ఇండియా పంపిన నోటీస్ మూలిగే నక్కపై తాటిపండుపడ్డచందంగా మారింది.
పాకిస్తాన్ పట్ల మెతగ్గా వ్యవహరించిన ప్రతీ సందర్భంలోనూ ఇండియాకు ఎదురుదెబ్బలే తగిలాయి. స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నెలలకే కశ్మీర్ విషయంలో భారత్ దెబ్బతింది. 1960లో కుదిరిన సింధూనదీ జలాల ఒప్పందంలోనూ అదే జరిగింది. ఇండియా ఉదారంగా ఉండాలనుకుంటే.. పాక్ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ వచ్చింది. అదే ఇప్పుడు సింధూ నదీజలాల ఒప్పందంపై వివాదానికి దారి తీసింది. నీళ్లలో మంటలు వచ్చేలా చేసింది. తాజా నోటీస్ కింద ఒప్పంద ఉల్లంఘనలపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరపాలని పాకిస్తాన్‌కు భారత్ సూచించింది. అంతేగాకుండా గత 62 ఏళ్లలో నేర్చుకున్న పాఠాలను ఒప్పందంలో పొందుపర్చాల్సిన అవసరాన్ని కూడా స్పష్టం చేసింది. నాటి ఒప్పందం ప్రకారం.. మూడు తూర్పు నదులు.. సట్లెజ్, బియాస్, రావి నదుల జలాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఇండియాకు హక్కు ఉంది. మూడు పశ్చిమ నదులు.. ఇండస్, జీలం, చీనాబ్‌లపై హక్కు పాక్‌కు లభించింది. అదే సమయంలో ఈ మూడు పశ్చిమ నదుల నుంచి.. నిర్దేశిత డిజైన్‌లో రూపొందించిన ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే హక్కు కూడా భారత్‌కే దక్కింది. ప్రాజెక్టుల డిజైన్ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని లేవనెత్తే వీలు పాకిస్తాన్‌కు ఉందని కూడా ఈ ఒప్పందం సూచిస్తోంది.
వాస్తవానికి.. భారత్ చేపట్టిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు పాకిస్తాన్‌కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఈ ఒప్పందం విషయంలో ఆయా అంశాలను పరిష్కరించుకునేందుకు ఆ దేశ సర్కార్ ఎంచుకున్న మార్గాలే వివాదానికి దారి తీశాయి. భారత్‌కు ఆగ్రహం వచ్చేలా చేశాయి. ఈ వ్యవహారం ముదిరిపాకన పడి ఎక్కడికి దారి తీస్తుందో అనే ఆందోళన ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్లో వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ తీరుపై ఆగ్రహించిన భారత్, పాకిస్తాన్‌కు నీటి సరఫరాలో అడ్డంకులు కలిగిస్తే.. అసలుకే ఎసరు వస్తుందన్నవాదన కూడా వినిపిస్తోంది. ఇదే అంశం పాకిస్తాన్ పాలకులను సైతం భయపెడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే, ఈ వివాదంలో తెగేవరకూ లాగితే జరిగే నష్టాన్ని అంచనా వేసే భారత్ నోటీస్‌పై స్పందించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడైనా ఈ వివాదం పరిష్కారానికి ఓకే చెబుతుందో.. లేదంటే ఎప్పట్లానే చివరి నిమిషంలో మాట మారుస్తుందో చూడాలి.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...