ట్విటర్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ యూజర్లకు ఈసారి బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. ట్విటర్ లో చేసే ట్వీట్ తో డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించాడు మస్క్. ట్విటర్ లో చేసే పోస్ట్ అది ఏదైనా సరే.. స్టోరీ రాయటం.. వీడియో పోస్ట్ చేయటం.. ఇలా ఏది చేసినా దానిపై రెవెన్యూ సంపాదించుకునే మానెటైజేషన్ ను ఇస్తున్నట్టు మస్క్ అనౌన్స్ చేశాడు. అయితే.. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే.. కానీ త్వరలోనే ప్రపంచం మొత్తం ట్విటర్ మానెటైజేషన్ అమలు చేయబోతున్నట్టు కూడా చెప్పాడు. డబ్బులు సంపాదించుకునే క్రియేటర్ నుంచి ట్విటర్ ఎలాంటి కమిషన్ కానీ, రెవెన్యూలో భాగం కానీ తీసుకోబోమని కూడా చెప్పాడు. సంవత్సరం పాటు ట్విటర్ ద్వారా వచ్చే రెవెన్యూ మొత్తం క్రియటర్ కే ఇస్తామనీ.. సంవత్సరం తర్వాత ఆ రెవెన్యూలో కొంత షేర్ ట్విటర్ తీసుకుంటుందని చెప్పాడు.
ఫేస్ బుక్ కూడా మొదట సోషల్ మీడియా షేరింగ్ ప్లాట్ ఫామ్ గానే వచ్చి ఆ తర్వాత డబ్బులు సంపాదించి పెట్టే కమర్షియల్ ప్లాట్ ఫామ్ గా మారింది. ప్రస్తుతానికి యూట్యూబ్, ఫేస్ బుక్ అతిపెద్ద సోషల్ మీడియా ఎర్నింగ్ ప్లాట్ ఫామ్ లు. ఇప్పుడు ట్విటర్ కూడా మానెటైజేషన్ ఇచ్చేసింది. ట్విటర్ మానెటైజేషన్ వెనుక మస్క్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ట్విటర్ ను లాభాల బాట పట్టించటంతో పాటు సోషల్ మీడియా మార్కెట్లో మరింత బలంగా ట్విటర్ ను మార్చేందుకే మస్క్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఏది ఏమైనా.. ట్విటర్ మానెటైజేషన్ తో కంటెంట్ క్రియేట్ చేసే వారి సంఖ్య పెరగటంతో పాటు ట్విటర్ అకౌంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.