మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన చమురు కష్టాలు.. మున్ముందు ఇంకా పెరగనున్నాయే తప్ప తగ్గేలా కనిపించటం లేదు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం జరిగితే క్రూడాయిల్ క్రైసిస్ ముగిసి ఆయిల్ రేట్లు తగ్గుతాయేమోనని ప్రపంచం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న వేళ.. ప్రముఖ రేటింగ్స్ సంస్థ క్రిజిల్.. దిమ్మతిరిగే రిపోర్ట్ ఇచ్చింది. రానున్న రోజుల్లో భారతదేశంలో పెట్రోల్ రేట్లు భారీగా పెరగనున్నాయని చెప్తోంది. భారత్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ రేట్లు ఇప్పట్లో దిగి వచ్చే పరిస్థితులు లేవనీ.. యుద్ధం ఆగినా ఆయిల్ రేట్లు తగ్గటానికి చాలా సమయం పడుతుందనీ.. ఈ లోగా భారీగా పెరిగిన ధరలను ప్రజలు భరించక తప్పదని క్రిసిల్ చెప్తోంది. ప్రపంచ ఆయిల్ సంక్షోభం మరియు ఇంధన రేట్లపై క్రిసిల్ ప్రచురించిన రిపోర్ట్లో కీలక అంశాలను క్రిసిల్ ప్రస్తావించింది.
భారత్లో రానున్న నెల లేదా రెండు నెలల రోజుల్లో పెట్రోల్ మీద కనీసం 10 రూపాయలు పెరిగే అవకాశం ఉందనీ.. డీజిల్ ధర కూడా ఇదే రకమైన పెరుగుదల చూపించబోతున్నదనీ క్రిసిల్ చెప్తోంది. పెరిగిన ఇంధన ధరలతో ఇప్పటికే భారతదేశంలోని మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. క్రిసిల్ రిపోర్టు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాబోయే రోజుల్లో పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రాల మధ్య రవాణా జరిగే కూరగాయలు, పాలు వంటి వాటి ధర పెరగక తప్పదు. ధరలు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో ఉల్లి వ్యాపారులు ముందుగానే స్టాక్ ను మార్కెట్ నుంచి గోదాంలలోకి తరలించేస్తున్నారు. ధర తక్కువ ఉన్నప్పుడే కొని.. ధరలు పెరిగిన తర్వాత మార్కెట్లోకి వదిలేస్తే అధిక లాభాలు వస్తాయనేది దళారుల ఆలోచన. అయితే.. దళారులు కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెడుతోంది. ఏది ఏమైనా.. రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.

