పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ అంటే నాకు ప్రేమ.. తెలంగాణ నడిబొడ్డున నా పార్టీ జనసేన పుట్టింది.. నాకు తెలంగాణపై ఉన్న ప్రేమ రాజకీయలకు అతీతం.. నన్ను తెలంగాణకు రాకుండా ఎవ్వరూ ఆపలేరు.. దమ్ముంటే ఆపండి..” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ఉపన్యాసంతో రెచ్చిపోయాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేనాని హైదరాబాద్లో “తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం” పేరుతో సమావేశం నిర్వహించాలని భావించాడు. కానీ.. హైదరాబాద్ పోలీసులు జనసేన సమావేశానికి అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ సభ సందర్భంగా హైదరాబాద్లో చాలా రకాల కార్యక్రమాలు, సంబరాలు జరిగే అవకాశం ఉందనీ.. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన పోలీసులు.. జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేన నాయకులు తెలంగాణ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం.. పిటిషన్ను కొట్టేసింది. దీంతో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి.. హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు.
జూబ్లీహిల్స్లోని తన నివాసం వద్ద భారీ ఎత్తున హాజరైన జనసేన కార్యకర్తల మధ్యన జరిగిన ప్రెస్మీట్లో పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం చేశాడు. “నన్ను బెదిరించడానికి మీరెవరు.. నన్ను రావద్దని చెప్పడానికి మీరెవరు.. తెలంగాణ మీ అయ్య జాగీరా.. తెలంగాణ నలుమూలల తిరిగిన వాడిని నేను.. నాకు తెలంగాణలో లక్ష మంది జనసైనికులు ఉన్నారు.. బెదిరిస్తే చూస్తూ కూర్చోడానికి నేనేం చేతకాని వాడిని కాను.. ఖచ్చితంగా తెలంగాణ వస్తా.. ఇక్కడే ఉంటా.. నేనే స్వయంగా తెలంగాణ మొత్తం తిరుగుతా.. దమ్ముంటే ఆపండి.. ఏం చేస్కుంటారో చేస్కోండి..” అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
పాకిస్తాన్కు మద్దతిచ్చే వారిపై కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు.. పహల్గాంలో తీవ్రవాద దాడి జరిగితే కాంగ్రెస్ ఖండించదు.. లవ్ పాకిస్తాన్ అనే వాళ్ళను కాంగ్రెస్ నేతలు తిట్టరు.. కానీ తెలంగాణకు వస్తా అంటే నన్ను వద్దంటారా.. తెలంగాణ పాకిస్తానా.. లేక పాలస్తీనానా.. నేనే జనసేన తరఫున ఇక్కడ పోటీ చేస్తా.. దమ్ముంటే ఆపండి చూస్తా.. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
“జై తెలంగాణ అనని వాళ్ళంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు.. ఆంధ్రా ప్రజలు వ్యతిరేకించినా నేను ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చాను.. నా సినిమాల్లోనే కాదు.. నా ఆలోచనల్లో కూడా తెలంగాణ తత్త్వం ఉంటుంది.. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయటం కాంగ్రెస్ తరం కాదు.. ఇంకెన్నాళ్ళు నన్ను ఆంధ్రావాడు అని తెలంగాణకు దూరం చేసే ప్రయత్నం చేస్తారు.. ఆంధ్రా తెలంగాణ తేడాలు చూపిస్తే అది ఎంత వరకు వెళ్తుందో ఊహించగలరా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్ళు గడిచినా ఇంకా ఈ విడగొట్టే ప్రయత్నాలు ఎందుకు..” అంటూ కాంగ్రెస్ నేతలను నిలదీశారు.
“నా ఇంటి ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానో తెలుసా.. ఇది నా ఇంటి అడ్రస్.. ఎవడైనా దాడి చేయాలనుకుంటే ఇక్కడికే వచ్చి దాడి చేయండి.. అలాంటి వాటికి నేను భయపడను.. అంత భయపడే వాడిని అయితే పార్టీ పెట్టేవాడినా.. ఈ రోజు నేను డిసైడ్ అయ్యాను.. పక్కా తెలంగాణలో ఉంటా.. నాకు పౌరుషం చావలేదు.. తెలంగాణ మీద ప్రేమ చావలేదు..” అంటూ చాలెంజ్ చేశాడు

