భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. అంతే కాదు.. అమెరికా ఉభయ సభల్లో మోడీ ప్రసంగించే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నేరుగానే ఈ విషయాన్ని గురించి కథనాలు ప్రచురించింది. భారత్ లోనూ.. అమెరికాలోనూ ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తున్నది. మోడీని అమెరికాకు రప్పించి తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకునేందుకు జో బిడెన్ ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే.. అబ్ కీ బార్.. ట్రంప్ కీ సర్కార్ అంటూ గతంలో ట్రంప్ కోసం ప్రచారం చేసిన మోడీ ఇప్పుడు బైడెన్ కు ఓట్లు వేయాలని అమెరికా ప్రజలను కోరతారా అనేది సందేహమే. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో బైడెన్ భారత్ కు వార్నింగ్ ఇచ్చిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు.
జో బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోడీ అమెరికాలో సెప్టెంబర్ 2021లో పర్యటించారు. ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్తే రెండోసారి అవుతుంది. ప్రస్తుతం జీ20 కూటమి పగ్గాలు భారత్ చేతుల్లోనే ఉన్నాయి. అదీ కాక.. కొద్ది రోజుల క్రితం బైడెన్ వెతుక్కుంటూ వచ్చి మరీ మోడీని కలిసిన వీడియో ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసింది. సో.. అమెరికాకు మోడీ అవసరం ఉన్నట్టుంది. కాబట్టి మోడీకి ఈ సారి అమెరికా ప్రభుత్వం బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. కానీ మోడీ మరియు ఆయన యంత్రాంగం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. త్వరలోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.