ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఆంధ్రా పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించటమే ధ్యేయంగా బీఆర్ఎస్ తరఫున పద్నాలుగేళ్ళు అలుపెరుగని పోరాటం చేశామన్నారు. ఎంతో మంది విద్యార్థుల బలిదానాలకు ఫలితంగా ఏర్పడిన తెలంగాణ.. పదేళ్ళు అద్భుతమైన ప్రగతి దిశగా ప్రయాణించిందనీ.. కానీ ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి వెళ్ళిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ధ కాలం పాటు వెలుగు దిశగా పరుగులు పెట్టిన తెలంగాణ.. మోసగాళ్ళ పార్టీ చేతుల్లోకి వెళ్ళిందన్నారు.
అమాయకులైన తెలంగాణ ప్రజలను అబద్ధపు హామీలతో నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏ ఒక్క రోజు కూడా ఉద్యమం చేయని వాళ్ళ చేతుల్లోకి.. ఏ ఒక్క సారి కూడా జై తెలంగాణ అనని వాళ్ళ పాలనలోకి తెలంగాణ వెళ్ళడం దురదృష్టకరమన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్ అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఈ ముష్కర పాలన ఎంతో కాలం సాగదనీ.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం.. తెలంగాణ లెజెండ్ కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్ అధికారం కోల్పోతుందనేది తాము చెప్తున్న మాట కాదనీ.. తెలంగాణలో ఏ ఒక్కరిని అడిగినా వచ్చే సారి అధికారం బీఆర్ఎస్ పార్టీదే అన్న విషయం చెప్తారన్నారు.
కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను పక్కనపెట్టి.. అబద్ధపు హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు తాము ఇచ్చిన హామీలను కూడా పక్కనపెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటి రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు సొమ్మును కాంగ్రెస్ నేతలు మింగేశారని ఆరోపించారు. ఎరువుల కోసం ఎండలో లైన్లు కట్టాల్సిన దుస్థితికి తెలంగాణ రైతులను తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. తమకు న్యాయం చేస్తారని ఆశించి ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ.. ఆంధ్రా పాలకులకు తొత్తులుగా మారారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్.. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనీ.. కాంగ్రెస్ చేతిలో దగాపడిన తెలంగాణ పునర్వైభవం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు కేటీఆర్.

