Home TELANGANA ఖమ్మం సభ : సమయం లేక సగమే మాట్లాడిన కేసీఆర్

ఖమ్మం సభ : సమయం లేక సగమే మాట్లాడిన కేసీఆర్

0
ఖమ్మం సభ : సమయం లేక సగమే మాట్లాడిన కేసీఆర్

భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారోనని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు జాతీయ రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురు చూసిన వేళ.. ఆయన మాత్రం సమయం లేక సగమే మాట్లాడినట్టు అనిపించింది. ఆయన కంటే ముందు ప్రసంగించిన మిగితా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఎక్కువ సమయాన్ని తీసుకోగా.. చివరికి ప్రసంగించిన కేసీఆర్.. చాలా తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించేశారు. “ముందు మీ పంచాయతి.. ఆ తర్వాత నా పంచాయితి..” అంటూ మొదలుపెట్టిన కేసీఆర్.. ముందు ఖమ్మం జిల్లాకు వరాల జల్లు కురిపిస్తూ కోట్లాది రూపాయల నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గురించి ప్రసంగం మొదలుపెట్టిన ఆయన.. షరా మామూలుగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ సహా కేంద్రం విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు.

ప్రపంచంలో మరే దేశానికి లేనంత వ్యవసాయ భూమి.. అద్భుతమైన నీటి వనరులు.. మానవ వనరులు భారతదేశంలో ఉన్నా వాటిని వినియోగించుకునే బుద్ధి మాత్రం పాలకులకు లేకుండా పోయిందన్నారు. చిన్న చిన్న దేశాల్లో పెద్ద పెద్ద నీటి ప్రాజెక్టులు ఉంటే.. ఇంత పెద్ద దేశంలో ఒక్క ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కూడా లేదన్నారు. బీఆర్ఎస్ కు స్పష్టమైన విధానం ఉన్నదనీ.. కేంద్రంలో వచ్చేసారి అధికారంలోకి వచ్చేది తామేననీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినట్టే దళిత బంధు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశం మొత్తం అమలు చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం 25 లక్షల కుటుంబాల చొప్పున ప్రతి దళితుడికి దళిత బంధు అందజేస్తామన్నారు. ఎవరి దగ్గరా చేయి చాపి రుణాలు అడగాల్సిన పరిస్తితి భారత్ కు లేదనీ.. పాలకుల వల్లనే ఆ పరిస్థితి వచ్చిందన్నారు. ఏ దేశం ముందైనా సరే మోకరిల్ల వలసిన అ‌వసరం భారత్ కు లేదనీ.. తాము అధికారంలోకి వస్తే భారత్ రాత మార్చేస్తామన్నారు. రైతులు, నీరు, కరెంటు.. ఇలాంటివే బీఆర్ఎస్ అసలు లక్ష్యమని చెప్పారు. సమయం ఎక్కువగా లేదనీ.. ఇంత కంటే ఎక్కువ మాట్లాడలేననీ చెప్పిన కేసీఆర్.. తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని పూర్తి చేసి తిరుగు పయనమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here