అస్సాంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జోర్హాట్ ఎయిర్బేస్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానం, జోర్హాట్ ఎయిర్బేస్లో ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు పేర్కొన్నారు. ల్యాండ్ అవుతున్న సమయంలోనే విమానంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి, మంటలు వ్యాపించాయని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని వారు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్బేస్లోని ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు అప్రమత్తమై, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టాయని అధికారులు వివరించారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, విమానంలో ఉన్న క్రూ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పరిస్థితిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై భారత వాయుసేన ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఐఏఎఫ్ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనుందని అధికారులు స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారత వాయుసేనకు చెందిన అతిముఖ్యమైన స్థావరాలలో రౌరియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఒకటి. అస్సాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలు నిర్వహించడంలో ఇది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది.
మృతుల్లో ఇద్దరు వాయుసేన అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
