ఇరాన్ అమెరికాల మధ్య మొదలైన యుద్ధం.. రాను రాను హర్ముజ్ జలసంధి చుట్టూ వైరంగా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గమైన హర్ముజ్ స్ట్రైట్ను ఇరాన్ పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవటంతో చమురు ఉత్పాదక దేశాల నుంచి చాలా వరకు ప్రపంచానికి ఇంధన సరఫరా ఆగిపోయిన విషయం తెలిసిందే. తన మిత్రదేశాల చమురు రవాణా ఓడలను తప్ప మిగతా దేశాల నుంచి హర్ముజ్ ద్వారా ప్రయాణించే ఓడలను ఇరాన్ చాలా వరకు అడ్డుకుంది. మిలియన్ల కొద్దీ రుసుము చెల్లిస్తే గానీ వాటిని వదలకుండా మొండి పట్టుపట్టింది. ఫలితంగా భారత్ సహా చాలా దేశాలకు ఇంధన సంక్షోభం సెగ తలిగింది. కానీ.. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి వెల్లడించారు. హర్మూజ్ జలసంధి మరోనెల రోజుల పాటు మూతపడి ఇంధన సరఫరాకు అవరోధం ఏర్పడినా 30 నుంచి 60 రోజుల పాటు ఆ షాక్ను భారత్ తట్టుకోగలదని, ఆ మేర ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం భారత్ వద్ద కనీసం 80 రోజులకు సరిపడే ఇంధన నిల్వలు ఉన్నాయన్న హరిదీప్.. ఇప్పటికిప్పుడు చమురు సంక్షోభం చుట్టుముట్టినా భారత్కు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడినా, భారతదేశం సులువుగా తట్టుకోగలదని పేర్కొన్నారు. గల్ఫ్ వెలుపల ఉన్న ఇతర చమురు ఉత్పాదక దేశాల నుంచి సరఫరాను పెంచడం, అలాగే మొజాంబిక్ నుంచి అదనపు గ్యాస్ సరఫరాను అందుకోవడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకుంటోందని హర్దీప్ సింగ్ పురి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో అదనపు ఎల్పీజీ కార్గోలను సరఫరా చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కీలక భాగస్వామ్య దేశాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చమురు కంపెనీల షేర్లు కొనుక్కోవాలనీ.. భవిష్యత్తులో భారత చమురు కంపెనీల షేర్ల ధరలు విపరీతమైన లాభాలను ఇవ్వగలవని సలహా ఇచ్చారు హరిదీప్.

