పాబ్లో ఎస్కోబార్.. ఒకప్పుడు ప్రపంచ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలిన మకుటంలేని మహారాజు ఇతను. తన కూతురుకు చలేస్తున్నదని ఒక రాత్రి మొత్తం కరెన్సీ నోట్లను తగలబెడుతూ చలి కాచుకున్న చీకటి రాజ్యపు బిల్ గేట్స్. డ్రగ్స్ మార్కెట్ అంటే అంత పెద్ద సామ్రాజ్యం మరి. డ్రగ్స్ మరియు ఆయుధ మాఫియా తలచుకుంటే దేశాల ప్రభుత్వాలే కూలిపోతాయి. అంత శక్తివంతమైనది డ్రగ్స్ మాఫియా. అందుకే పాబ్లో ఎస్కోబార్ ప్రపంచంలోని చాలా దేశాల ప్రభుత్వాలను కంటి చూపుతో శాసించాడు. ఇప్పుడు అలాంటి మరో కొత్త డాన్ చరిత్ర వెలుగులోకి వచ్చింది. ఆ కొత్త డాన్ పేరు హాజీ సలీం.
అరేబియా సముద్రంలో మూడురోజుల క్రితం ఎన్సీబీ అధికారులు భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 2.5 టన్నుల మెథంఫెటమిన్ను సీజ్ చేశారు. దీని విలువ 15వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో దాని వ్యాల్యూ 25వేల కోట్ల రూపాయలని తేలింది. ఇండియా చరిత్రలో ఇంతపెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ సమయంలో ఈ ఘటనను దేశం మొత్తం రెగ్యులర్గా జరిగే ఇష్యూగానే చూసింది. అరేబియా సముద్రంలోనో మరో చోటో ఇలా డ్రగ్స్ పట్టుబడ్డంలో పెద్ద వింతేం ఉందిలే అనుకుంది. కానీ, ఇందులోని సీరియస్ నెస్ మాత్రం ఆ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులకే తెలుసు. ఎందుకంటే వాళ్లు పక్కా ప్లాన్ ప్రకారమే ఆపరేషన్ సముద్రగుప్తను నిర్వహించారు. అరేబియా సముద్రంలో ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహించడానికి అసలు కారణం 2.5 టన్నుల డ్రగ్స్ వెనుక ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్పిన్ హాజీ సలీం ఉండటమే.
హాజీ సలీం.. అలియాస్ హాజీ అలీ. భారత ఎన్సీబీ అధికారుల మోస్ట్వాంటెడ్ డ్రగ్స్ కింగ్పిన్. ఎలా ఉంటాడో తెలీదు.. ఎప్పుడు ఎక్కడుంటాడో కనిపెట్టడం కష్టం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అండతో అరేబియా సముద్రంలో వేల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో అదే ఐఎస్ఐతో పాటూ పాకిస్తాన్ తీవ్రవాద సంస్ధలకు అండగా నిలుస్తున్నాడు. ఇతడి లక్ష్యం ఇండియాను నాశనం చేయడం ఒక్కటే.
హాజీ సలీం ఎక్కడా ఒక చోట స్థిరమైన స్థావరంలో ఉండడని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. అతడు కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ తరహాలో స్థావరాలను మార్చేస్తాడని పేర్కొన్నారు. ఇరాన్, పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ల నుంచి తన వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అతడికి ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా లభిస్తాయి. పాకిస్తాన్లో అతడు బలోచిస్థాన్ ప్రావిన్స్లో ఉంటాడు. అతడి వెంట ఎప్పుడూ ఏకే-47లు, ఇతర అత్యాధునిక ఆయుధాలతో కూడిన బాడీగార్డుల వలయం ఉంటుంది. సలీం ఎల్లవేళలా శాటిలైట్ ఫోన్ వాడుతుంటాడు. మాల్దీవుల నుంచి పాకిస్తాన్ వరకు కమ్యూనికేషన్లు నెరుపుతుంటాడు. ఇప్పటికే డీజీ స్థాయి సమావేశంలో భారత్ అతడి వివరాలను పాక్, ఇరాన్, అఫ్గాన్కు అందించింది. కానీ, ఆ దేశాలన్నీ ఇతడిని చూసీచూడనట్లు వదిలేసేవే కాబట్టి ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో విచ్చల విడిగా ఈ కేటుగాడి వికృత క్రీడ కొనసాగుతోంది.
డ్రగ్స్ సరఫరాలో హాజీ సలీం యాక్షన్ అంతుచిక్కని రీతిలో ఉంటుంది. మాదక ద్రవ్యాలను కార్టల్స్కు సరఫరా చేసేందుకు ముందే డబ్బు తీసుకోడు. అప్పుగా వాటిని సరఫరా చేస్తాడు. తొలుత వాటిని విక్రయించి.. ఆ తర్వాత వచ్చిన సొమ్మును హవాల మార్గంలో చెల్లించమని చెబు తాడు. అలాగే, సలీం నుంచి వివిధ కార్టల్స్కు సరఫరా అయ్యే మాదకద్రవ్యాల ప్యాకెట్లపై ప్రత్యేకమైన గుర్తు లుంటాయి. ఇవి ఆ కార్టల్స్కు మాత్రమే తెలుసేలా ఉంటాయి. వీటిల్లో 999, 777, రోలెక్స్ 555, తేలు, బిట్కాయిన్, ఎగిరే గుర్రం, కింగ్ 21 లాంటి గుర్తులను ఎన్సీబీ, డీఆర్ఐ, ఎన్ఐఏ సంస్థలు గుర్తించాయి.
హాజీ సలీం నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్ కనీసం ఏడు పొరలతో బలంగా ప్యాక్ చేస్తారు. వాటిని నీటిలో పడేసినా దెబ్బతినకుండా ఇలా చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం భారత్లో అతడి తరఫున పనిచేస్తున్న వారిని ముంద్రా పోర్టు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అప్పట్నుంచే ఈ డ్రగ్ కింగ్పిన్ ఆట కట్టించాలని ఎన్సీపీ బలంగా డిసైడ్ అయింది. మరో షాకింగ్ విషయమేంటంటే.. హాజీ సలీం శ్రీలంకలోని డ్రగ్ మాఫియా డాన్లు సి.గుణశేఖరన్ అలియాస్ గుణ, పుష్పరాజ్ అలియాస్ పూకుట్టి కన్నాలతో చేతులు కలిపాడు. ప్రస్తుతం వీళ్లంతా ఎల్టీటీఈ ని పునరుద్దరించే పనిలో ఉన్నారు. ఇందుకోసం అవసరమైన డబ్బును డ్రగ్స్ రూపంలోనే ఇస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఎల్టీటీఈని ఇండియాకు వ్యతిరేకంగా బలోపేతం చేయడమే హాజీ అసలు లక్ష్యం అని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో హాజీ సలీంకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో బలమైన సంబంధాలు ఉన్నాయి. డ్రగ్ డీల్స్ కోసం కరాచీలోని క్లిఫ్టన్ రోడ్డులో దావూద్ రహస్య స్థావరానికి ఇతడు వస్తుంటాడని తెలుస్తోంది. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కూడా హాజీ సాయం తీసు కుంటోంది. ప్రత్యేకించి ఇండియాలో డ్రగ్స్ వ్యాపార విస్తరణతోపాటూ భారత వ్యతిరేక శక్తులకు యాక్టివ్ చేయడమే ఈ కేటుగాడి లక్ష్యంగా కనిపిస్తోంది. అసలే ఖలిస్తానీ శక్తులు బలపడి ఇండియాకు సవాళ్లు విసురుతున్న ఇలాంటి సమయంలో ఎల్టీటీఈ కూడా బలపడితే మన దేశానికి ముప్పు తప్పకపోవచ్చు. తమిళనాడులో ఇప్పుడున్న డీఎంకే సర్కార్ కూడా ఎల్టీటీఈని వ్యతిరేకించదు. హాజీ సలీం కూడా ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే కుట్రలు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ఇండియా ముందున్న లక్ష్యం ఒక్కటే డ్రగ్స్ కింగ్పిన్ హాజీ సలీం ఆటకట్టించడం. ఇందులో భాగంగానే ఆపరేషన్ సముద్రగుప్తి పేరిట ఎప్పుడో యాక్షన్లోకి దిగిపోయింది. ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ 40వేల కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఐతే, దీనివెనుకున్న డ్రగ్స్ డాన్ మాత్రం అంత ఈజీగా దొరికే పరిస్థితులు కనిపించడంలేదు. మరి ఈ కన్నింగ్ డాన్కు ఇండియా ఎలాంటి క్లైమాక్స్ ఇస్తుందో చూడాలి.