బంగారం ధరల డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు.. ఈ వారం మరింత తగ్గుదల నమోదు చేశాయి. చాలా రోజుల తర్వాత బంగారం వెండి ధరల్లో ఈ రకమైన కుదుపు నమోదైంది. ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర 150 డాలర్లు తగ్గి 4110 డాలర్లకు చేరడంతో.. హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,400కు చేరింది. కిలో వెండి ధర కూడా రూ.2,42,000కు దిగి వచ్చింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,900, కిలో వెండి ధర రూ.2,51,480 కి చేరింది. 10 గ్రాముల బంగారం ధర రూ.6,000కు పైగా, కిలో వెండి ధర రూ.9,500 తగ్గింది.
మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం.. చాలా దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నందున, సమీపకాలంలో బంగారం, వెండి ధరలు మరికొంత తగ్గే వీలుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధర మళ్లీ పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం.. అధిక ద్రవ్యోల్బణంలోనూ ఉద్యోగ నియామకాలు అంచనాలకు మించడంతో అమెరికాలో వడ్డీరేట్లు తగ్గవనే భావనలు పెరిగాయి. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 11 వారాల కనిష్ఠస్థాయికి చేరాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మార్చిలో ఔన్సు బంగారం ధర 5400 డాలర్లు కాగా, ఇప్పటికి 1400 డాలర్లు క్షీణించింది. డాలర్ బలోపేతం అయితే, ఇతర కరెన్సీలు వినియోగించే వారికి బంగారం కొనడం భారంగా మారుతుంది. ముడిచమురు ధర పెరిగినప్పుడూ, పసిడిపైకి పెట్టుబడులు తగ్గుతుంటాయి. బంగారం ధర తగ్గటంతో ఆభరణాల ధరలు కూడా భారీగానే దిగొచ్చాయి.

