మత మార్పిడి.. గత కొద్ది రోజులుగా తరచుగా వినిపిస్తున్న అంశం. కేరళలో వేలమంది హిందూ యువతులను ప్రేమ మత్తులోకి దించి, ఆపై మతం మార్చుకునేల ప్రేరేపించి, చివరకు ఉగ్రవాదంలోకి దించి, వారి జీవితాలను ఎలా నాశనం చేశారో ఆ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా చాలానే వివాదాలు రేపింది. కేరళలో మిస్సింగ్ కేసులు నిజమే అయినా లవ్ జిహాదీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని విపక్షాలు.. ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఉలికెందుకని అధికార బీజేపీ.. ఇలా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయడం, ఇంకొన్ని రాష్ట్రాల్లో కేరళ స్టోరీ కి బెనిఫఇట్ షోలవంటి బెనిఫెట్లు ఇవ్వడం లాంటి పరిణామాలు చాలానే జరిగాయి. అంతెందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే ఈ సినిమా ప్రస్తావన రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి ఆ సినిమా థియేటర్ల నుంచి ఓటీటీలోకి వచ్చిన తర్వాతకూడా కేరళలో ఉద్రిక్తతలు ఆగలేదు. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇప్పుడు అలాంటి వ్యవహారమే దేశంలో కొత్త రచ్చకు కారణం అయ్యేలా కనిపిస్తోంది.
ఇంతకాలం ఆన్లైన్ గేమింగ్ చాలామందిని బానిసలుగా చేసుకుంది. ఇంకొంతమందిని ఆర్ధికంగా చిదిమేసింది.. ఇప్పుడదే ఆన్ లైన్ గేమింగ్ మతాలు మార్చేస్తుంది. అవును.. ఇది నిజమే. ఫోర్ట్ నైట్ అనే గేమ్ ఆడితూ ఆడుతూ.. ఓ దశలో మతం మార్చుకునే రేంజ్ లో ఈ గేమ్ ద్వారా బ్రెయిన్ వాష్ చేయబడుతోంది. అసలు ఈ మతమార్పిడి గేమ్ ఏంటి? దీనికి సూత్రధారి ఎవరు? అనే యాంగిల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. మైండ్ బ్లాంక్ అయిపోయే వాస్తవాలు చెప్పారు. పిల్లలను మతం మారాల్సిందిగా బ్రెయిన్ వాష్ చేసేందుకు ఈ కేటుగాళ్లు ఆన్లైన్ గేమింగ్ను ఎంచుకున్నారు. వీళ్లు ఎంచుకున్న గేమ్ పేరు ఫోర్ట్నైట్. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి, పాత్రధారీ షానవాజ్ అలియాస్ బడ్డో అని తేలింది. ఆన్లైన్ గేమింగ్ ద్వారా పిల్లలను ట్రాప్ చేయడమే ఈ ముఠా పని. ఆన్లైన్ గేమ్స్ ద్వారా పిల్లలను తప్పుదోవ పట్టించే కళలో షానవాజ్ ఎక్స్పర్ట్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ గేమ్ ద్వారా షానవాజ్ చాలా మంది పిల్లలను తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే, దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఈ ఆటతో సంబంధం ఉన్న అబ్దుల్ రెహమాన్ అనే మతగురువు కూడా పోలీసులకు చిక్కాడు. అయితే ఈ ఆట సూత్రధారి బడ్డో ఇంకా పరారీలో ఉన్నాడు. అతడిని వెతుక్కుంటూ ముంబై చేరుకున్న ఘజియాబాద్ పోలీసులు థానే, షోలాపూర్లలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన బడ్డో ఫోర్ట్నైట్ గేమ్ ఆడుతున్న పిల్లలనే టార్గెట్ చేసుకున్నాడు. ఈ ఆన్లైన్ గేమ్ గురించి చాలా మందికి తెలిసినా.. దీని ద్వారా ఘజియాబాద్లో పిల్లలను మతం మార్చేలా ట్రైన్ చేస్తున్నారని చాలా మందికి తెలియదు. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షానవాజ్ ఫోర్ట్నైట్ గేమ్లో ఎక్స్పర్ట్ అయిన ఆటగాడు. ఈ గేమ్ ప్లే స్టోర్లో అందుబాటులో లేదని, ఇతర యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫోర్ట్నైట్ గేమ్లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్లల్లో ఒక్కడే ఈ షానవాజ్. ఈ గేమ్లో బడ్డో పేరుతో షానవాజ్ తన ఐడీని క్రియేట్ చేశాడు. షానవాజ్ ఈ గేమ్లో ఛాంపియన్ కావడంతో అతనితో ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి పిల్లలు ఇష్టపడేవారు. దీన్ని తనకు అనూకూలంగా మలచుకున్న బడ్డో.. డిస్కార్డ్చాటింగ్ యాప్ను ఆ పిల్లలతో సంభాషించడానికి ఉపయోగించుకున్నాడు. ఇందులో ఎక్కువ గా గేమర్లే ఉంటారు. ఈ యాప్లో షానవాజ్ పిల్లల గ్రూప్ క్రియేట్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ చాట్ గ్రూప్లో పిల్లలు షానవాజ్ను గేమ్ ఆడమని రిక్వస్ట్ చేసేవారు. వారి ప్రోద్బలంతో షానవాజ్ ఆన్ లైన్ గేమ్ ఆడుతూ పిల్లలతో చాట్ చేసేవాడు. ట్రిక్స్ చెప్పేవాడు. ఇంతవరకూ ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆ తర్వాతే క్రమంగా జకీర్ నాయక్ వీడియోలను ఈ చాటింగ్ ప్లాట్ ఫాలో షేర్ చేయడం స్టార్ట్ చేశాడట. తర్వాత కొన్ని బ్రెయిన్ వాష్ వీడియోలను కూడా షేర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ గ్రూప్లో ఉండే పిల్లలు, ఇతర వ్యక్తులను సమీపంలోని మసీదుకు వెళ్లి ప్రాక్టీస్ చేయాలని బలవంతం చేసేవాడని చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారం పోలీసుల వరకూ రావడానికి కారణం బడ్డో బ్రెయిన్ వాష్తో మతం మారిన ఓ వ్యక్తే. బడ్డో చిన్నారులనే కాదు పెద్దవారినీ టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో మతం మారిన ఓ వ్యక్తి.. తనలాగే మతం మార్చుకోవాలని తన కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో భయపడిపోయిన ఆ వ్యక్తి కుమార్తె విషయాన్ని సనాతన సంఘ్ అనే సంస్థకు చెప్పింది. తన తండ్రిలా నాలుగు వందల మందిని మతమార్పిడి చేశారని ఓ వీడియో షూట్ చేసి వాళ్లకు పంపించింది. సనాతన సంఘ్ సంస్థను నడుపుతున్న ఉపదేశ్ రాణా అనే వ్యక్తికి వీడియో పంపించి.. మతమార్పిడి ముఠా బారి నుంచి ఎలాగైనా తన తండ్రిని కాపాడాలని కోరింది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ అతిపెద్ద మతమార్పిడి రాకెట్పై హోం మంత్రిత్వ శాఖ కూడా నిఘా పెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సూత్రధారి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సూత్రధారి దొరికితే ఇంకెలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఏదేమైనా ఆన్లైన్ గేమింగ్కు అలవాటుపడిన పిల్లలపై ఈ కోణంలో కూడా ఓ కన్నేయాల్సిన బాధ్యత పేరెంట్స్పై ఉంది. సో.. బీ అలర్ట్..!