ఆర్థిక మాంద్యం పేరుతో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమేజాన్, ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ అయినా కాగ్నిజెంట్ 3 వేల ఐదు వందల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవి కుమార్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు మూడున్నర లక్షల మంది ఉద్యోగులు కాగ్నిజెంట్ లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ భాగం భారత్ లోనే పనిచేస్తారు. సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు భారత్ లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తొలగించిన ఉద్యోగులు భారత్ లో పనిచేసే వారా లేక ఇతర దేశంలో పనిచేసే వారా అనేది ఆయన చెప్పలేదు.
ఉద్యోగులకు రెండు నెలల ముందే పింక్ స్లిప్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించుకున్నదనీ.. ఖర్చుల తగ్గింపు కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ రవి కుమార్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కార్యాలయాలను కూడా ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఈ సంవత్సరం కాగ్నిజెంట్ కు లాభాలు గణనీయంగా పడిపోయాయని.. ఫలితంగానే ఖర్చులను తగ్గించుకోవాల్సి రావటం వల్లనే ఉద్యోగుల తొలగింపు మరియు కార్యాలయాలు ఖాళీ చేయాలనే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనీ చెప్పారు.