HomeINTERNATIONAL NEWSఅరుణాచల్ ప్రదేశ్ ఆక్రమణకు చైనా కొత్త కుట్ర

అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమణకు చైనా కొత్త కుట్ర

Published on

Latest articles

“We Have to Listen to the ISI”: Pakistan Defence Minister Makes Candid Remarks

Pakistan's political system has long been the subject of debate, with critics alleging that...

Big News for IPL Fans: BCCI Reportedly Considering Major Scheduling Change

Cricket enjoys immense popularity in India, with the Indian Premier League (IPL) being one...

Social Media Speculation Over Missing Child Draws Criticism

In the race for views and subscribers, many social media users are resorting to...

సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మరో దుస్సాహసానికి తెగబడింది. మన భూభాగం అరుణాచల్ ప్రదేశ్ తమదే అన్నట్టుగా పేర్లమార్పు కుట్రలు కొనసాగిస్తోంది. గ‌త కొన్ని నెల‌లుగాఅరుణాచ‌ల్‌ ప్ర‌దేశ్‌ను త‌మ ప్రాంతంగా ప్ర‌క‌టించుకుంటోంది. అలాగే, దాన్ని వారి దేశ ప‌టంలోనూ చూపించుకుంటోంది. ఈ క్ర‌మంలోనే అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాలలో మూడవ సెట్ పేర్లను విడుదల చేసింది. చైనా క్యాబినెట్ స్టేట్ కౌన్సిల్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా అరుణాచల్ ప్రదేశ్‌కు 11 ప్రాంతాల ప్రామాణిక పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని చైనా ప్ర‌భుత్వ మీడియా పేర్కొంది. దీంతో చైనా చర్యను భారత్‌తీవ్రంగా ఖండించింది. అరుణాచల్‌ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టంచేస్తూ డ్రాగ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనాది అయిపోదంటూ ఫైర్ అయింది.
వాస్తవానికి.. అరుణాచల్ ప్రదేశ్ భారత దేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. ఈ రాష్ట్రం భూటాన్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లో ఉంది. మన దేశ రక్షణ, భద్రత విషయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. బ్రిటిష్ అధికారులు నియంతృత్వంతో గీసిన రేఖతోపాటు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దులు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఐతే 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివాదం ప్రారంభమైంది. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఈ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తుంగలో తొక్కింది. అసమానతలతో కూడిన ఒప్పందాల తమపై రుద్దారని ఆరోపిస్తూ, భారత్‌తో అన్ని సరిహద్దులను మళ్లీ చర్చించి, నిర్ణయిం చాలని డిమాండ్ చేస్తోంది. ఈస్టర్న్ సెక్టర్‌లో మెక్‌మెహన్ రేఖను 1914లో బ్రిటిష్ ఇండియా-టిబెట్ మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. చైనా, టిబెట్, గ్రేట్ బ్రిటన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో ఈ నిర్ణయం జరిగింది.
మరోవైపు.. అరుణాచల్ ప్రదేశ్‌పై చిచ్చు రేపింది డ్రాగన్ కంట్రీనే. అధికారికంగా గీయని సరిహద్దు ను డ్రాగన్ వివాదాస్పదం చేసింది. చైనా 1949-50లో టిబెట్‌పై దాడి చేసింది. సిమ్లా ఒప్పందంపై టిబెట్ ప్రభుత్వం సంతకం చేసిందని, అప్పటికి టిబెట్ సార్వభౌమాధికారం గల దేశం కాదని చైనా వాదించింది. తవాంగ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగమని చైనా వాదించింది. 1962లో భారత్‌పై చైనా యుద్ధం చేసింది. హిమాలయాలకు పశ్చిమ దిశలో ఉన్న చికెన్స్ నెక్‌గా పేర్కొనే ఆక్సాయ్ చిన్ ప్రాంతంలోనే ఈ యుద్ధం జరిగింది. 90 వేల చదరపు కిలోమీటర్లు తనదేనని వాదించింది. అంటే దాదాపుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతా తనదేనని డ్రాగన్ కంట్రీ వాదించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించే మ్యాప్స్ తయారు చేసింది. ఈ రాష్ట్రాన్ని జంగ్నన్ రాష్ట్రంగా పేర్కొంది. ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను గతంలో కూడా చైనా మార్చింది. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు 2017, 2021 సంవత్సరాల్లో ప్రయత్నించింది. అప్పుడు కూడా ఈ దుశ్చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత దేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. పెట్టుడు పేర్లను పెట్టినంత మాత్రానికి వాస్తవాలు మారిపోయే ప్రసక్తే లేదంది.
ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా ఇరు దేశాల మధ్య చిన్నపాటి యుద్ధాలే జరిగాయి.
చైనా, భారత్ సైన్యాల మధ్య తీవ్రమైన ఘర్షణ 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా ప్రాంతంలో జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. 2020లో గాల్వన్ లోయలోజరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనా సైన్యం కేవలం నలుగురినే కోల్పోయినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. కానీ 40 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మీడియా సంస్థలు నివేదించాయి. ఇక గతేడాది డిసెంబర్‌లోను అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్, యాంగ్‌ట్సే వద్ద ఇరు దేశాల సైన్యాలు తలపడ్డాయి. ఇక.. భారత్-చైనా మధ్య సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు వరకు ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వద్ద ఉన్న సరిహద్దును ఈస్టర్న్ సెక్టర్ అంటారు. లడఖ్‌ వద్ద ఉన్న సరిహద్దును వెస్టర్న్ సెక్టర్ అంటారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న సరిహద్దునుమిడిల్ సెక్టర్ అంటారు. ఐతే ఎల్ఏసీ కేవలం 2వేల కిలోమీటర్లు మాత్రమేనని చైనా వాదిస్తోంది. ఈ సరిహద్దులను సక్రమంగా నిర్వచించకపోవడం వల్లే ఇరు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌పై డ్రాగన్ యాక్షన్ మార్చడానికి ఇటీవల జరిగిన పరిణామాలే కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆరేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రమైన డోక్లాంపై మార్చి ఎండింగ్‌లో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకు డ్రాగన్ కంట్రీ ఆ ప్రదేశంలోకి అక్రమంగా చోరబడుతోందని విశ్వసిస్తుంటే.. ఈ వివాదం పరిష్కరించడంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ అన్నారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, భారత్‌, చైనాలు కూడా రెడీగా ఉంటే చర్చించుకుందాం అన్నారు. ఐనా మూడు సమాన దేశాలే అనీ.. ఇందులో పెద్ద లేదా చిన్నా దేశాలు లేవు కదా వ్యాఖ్యానించారు. తద్వారా భూటాన్‌ ‌తాను చర్చలకు సుముఖంగా ఉన్నట్లు నేరుగానే సంకేతాలిచ్చింది. భూటాన్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌ని టెన్షన్‌లో పడేశాయి.
డోక్లాం అనేది భారత్, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతం. ఈ ఎత్తైన పీఠభూమి సిలిగురి కారిడార్‌కి సమీపంలో ఉంది. చైనా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించే యోచన చేసింది. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక భారత్‌ బలగాలు ఆ పనులను అడ్డుకున్నాయి కూడా. వాస్తవానికి సిలిగురి కారిడార్‌ ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో కలిపే ప్రాంతం. గతంలో 2019లో ఈ ట్రై జంక్షన్‌ పాయింట్‌ వద్ద ఏకపక్షంగా ఎటువైపు నుంచి ఎవరూ ఏం చేయకూడదన్న ఒప్పందానికి భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ చేసిన ప్రకటన చాలా విరుద్ధంగా ఉంది. చైనా ఆ ట్రై జంక్షన్‌ని బటాంగ్‌ లా నుంచి దక్షిణాం వైపు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్‌ గిమ్‌మోచి అనే శిఖరానికి మార్చాలనుకుంటోంది. అదే జరిగితే మొత్తం డోక్లాం భూభాగం డ్రాగన్ కంట్రీ భాగమవుతుంది. ఇది భారత్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ మంచిది కాదు. అయితే ఆ సమయంలో చైనా ఒత్తిడితోనే భూటాన్ ప్రధాని ఆ తరహా వ్యాఖ్యలు చేశారనే చర్చ జరిగింది. ఇలాంటి సమయంలో భారత్ కూడా అందుకు తగ్గట్టే యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. భూటాన్ ప్రధాని ప్రకటనపై పైకి స్పందించకున్నా అంతర్గతంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే భూటాన్ రాజు భారత్‌ టూర్ ఖరారైంది. ఈ పరిణామం డ్రాగన్ కంట్రీకి ఊహించని షాకిచ్చినట్టయింది.
భూటాన్ రాజు ఇండియాలో అడుగుపెట్టడం, అరుణాచల్ ప్రదేశ్ పేర్లు మారుస్తున్నట్టు చైనా మీడియా ప్రకటించడం ఆల్మోస్ట్ ఒకే సమయంలో జరిగాయి. ఇదే సమయంలో భూటాన్ రాజు భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే సమావేశమైంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌‌, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌లతోనే. భూటాన్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారం తర్వాత ఆ దేశ రాజుతో దోవల్, జైశంకర్‌ ఎలాంటి చర్చలు జరుపుతారో చైనాకు తెలుసు. అందుకే ఈ భేటీ తర్వాత బీజింగ్‌లో కొత్త అనుమానాలు మొదలయ్యాయనే చర్చ జరుగుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా డోక్లాంలో మకాం వేద్దాం అనుకున్న వేళ భూటాన్ ఇండియాకు దగ్గర కావడం బీజింగ్‌కు ఏమాత్రం రుచించని అంశమే. దీంతో భూటాన్ రాజు భారత పర్యటను వ్యతిరేకిస్తూనే అరుణాచల్‌‌ప్రదేశ్‌ పేర్లమార్పు డ్రామాకు తెరతీసిందనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామం ద్వారా ఇండియాపై తన యాక్షన్ ఏంటో భూటాన్‌కు తెలియజెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. అయితే, డ్రాగన్ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో భారత్ లేదు. అలాగే భూటాన్‌ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఇండియాకు తెలుసు. ఈ విషయంలో ప్రధాని మోడీ, భూటాన్ రాజు సమావేశం ముగిసిన తర్వాత భారత విదేశాంగ కార్యదర్శ అలాంటి క్లారిటీనే ఇచ్చారు. డోక్లామ్ సరిహద్దు నిర్ణయంపై భారత వైఖరిని పునరుద్ధాటించారు.
మొత్తంగా.. డోక్లాంలో మకాం వేద్దామని ప్లాన్ చేస్తున్న చైనాను భూటాన్‌ అడ్డుకునేలా ఇండియా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనిపిస్తోంది. ఈ విషయంలో తాజా ఒప్పందాల ద్వారా ఆ దేశం ఇండియాకు దగ్గరయితే డోక్లాంలో డ్రాగన్ ఆటలు సాగే పరిస్థితి ఉండదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్‌పై కుట్రలు చేస్తూ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కమాటలో భారత్, భూటాన్ దోస్తీతో డ్రాగన్ ఆశలు గండిపడ్డం ఖాయం.

FOLLOW US

More like this

“We Have to Listen to the ISI”: Pakistan Defence Minister Makes Candid Remarks

Pakistan's political system has long been the subject of debate, with critics alleging that...

Big News for IPL Fans: BCCI Reportedly Considering Major Scheduling Change

Cricket enjoys immense popularity in India, with the Indian Premier League (IPL) being one...

Social Media Speculation Over Missing Child Draws Criticism

In the race for views and subscribers, many social media users are resorting to...