కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయమే హైదరాబాద్ రావాల్సిన అమిత్ షా.. బిపోర్ జాయ్ తుఫాను కారణంగా తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు బీజేపీ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్ చేరుకొని గురువారం తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కావటంతో పాటు ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే.. ప్రస్తుతానికి అమిత్ షా సభ రద్దు అయినప్పటికీ త్వరలోనే ఆయన పర్యటన రీ షెడ్యూల్ అవుతుందని తెలంగాణ బీజేపీ నేతలు చెప్తున్నారు. భారత్ లో బిపోర్ జాయ్ తుఫాన్ అలజడే అమిత్ షా సభకు కారణంగా తెలుస్తోంది.
ఖమ్మంలో జరగాల్సిన అమిత్ షా పబ్లిక్ మీటింగ్ కోసం బీజేపీ వారం క్రితమే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ సభను సవాల్ గా తీసుకున్న తెలంగాణ బీజేపీ.. ఖమ్మం సభకు కనీసం లక్ష మందిని తరలించి తమ బలం నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. కొద్ది రోజుల క్రితమే ఈటెల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకున్న అమిత్ షా.. తెలంగాణ బీజేపీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కథనాలు వెలువడినాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో సమానమైన పదవిని ఈటెలకు కట్టబెట్టినట్టు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీల నుంచి అసంతృప్త నేతలకు గాలం వేసి బీజేపీలో చేర్చేందుకు ఈటెలతో కలిసి వ్యూహరచన కోసమే అమిత్ షా ఈటెలను ఢిల్లీ పిలిపించాడని వార్త. ఈ నేపథ్యంలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు కావటం.. అంతలోనే రద్దు కావటం జరిగిపోయాయి.