నారా లోకేష్ పాదయాత్ర మొదటి రోజే అపశృతి చోటు చేసుకుంది. కుప్పంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురై యాత్రలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో తారక్ ను హుటాహుటిన కుప్పంలోని కేసీ హాస్పిటల్ కు తరలించి అత్యవసర చికిత్స అందజేశారు. గుండెపోటు వచ్చిందేమోనన్న అనుమానంతో వైదులు తారక్ కు యాంజియోగ్రామ్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందనీ.. పూర్తి ఆరోగ్య వివరాలు త్వరలో వెల్లడిస్తామనీ కేసీ హాస్పిటల్ వైద్యులు చెప్పారు.
కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదటి రోజు మసీదులో ప్రార్థనలు నిర్వహించి అక్కడి నుంచి బయల్దేరిన సమయంలో అభిమానుల తాకిడి ఎక్కువైంది. లోకేష్, తారక్ తో పాటే బాలకృష్ణ కూడా ఉండటంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎగబడ్డారు. దీంతో తారక్ ఇబ్బంది పడ్డాడు. తనకు శ్వాస ఆడటం లేదనీ కాస్త దూరంగా ఉండాలని అభిమానులతో చెప్పారు. సెక్యురిటీ సిబ్బందిని కూడా తన వద్దకు ఎవరినీ రాకుండా అడ్డుకోవాలనీ.. ఊపిరి ఆడటం లేదనీ చెప్పారట. ఇది జరిగిన కొద్ది సేపటికే తారక్ సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంకా తారక్ కేసీ హాస్పిటల్ లోనే ఉన్నాడు.