ప్రపంచం ఎన్నో యుద్ధాలతో సతమతమవుతున్నప్పటికీ భారతదేశం ఎప్పుడూ తన ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించి వ్యవహరించిందనీ.. ఎవరు ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఎవరికీ లొంగకుండా తన వైఖరిపైనే స్ట్రాంగ్గా నిలబడిందనీ రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో కూడా భారత్ అలాగే వ్యవహరించిందనీ.. రష్యాను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా భారత్ను ఆంక్షలతో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ వ్యూహం తిప్పికొడుతుందనీ పరోక్షంగా యూరోపియన్ యూనియన్ను పుతిన్ హెచ్చరించాడు. సెయింట్ పీటర్స్బర్గ్లో జరుగుతోన్న ఆర్థిక సదస్సులో పుతిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“భారత్ ఒక సార్వభౌమాధికారం గల దేశం.. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సరైన దిశలోనే పయనిస్తోంది. తమ దేశ ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఆ దేశ నాయకత్వానికి ఉంది. ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భారత్ తన వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగానే పనిచేస్తోంది. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే.. మోదీ నాయకత్వంలోని భారత్కు వ్యతిరేకంగా ఆంక్షల పేరుతో ఎవరైనా బెదిరిస్తే.. అది వారికే ఎదురుదెబ్బ అవుతుంది..” అని పుతిన్ స్పష్టంగా చెప్పారు. భారత్ రష్యా నుంచి యుద్ధ విమానాలను మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేయనుందన్న వార్తల మేరకు పుతిన్కు మరో ప్రశ్న ఎదురైంది.
“SU-57, ఎస్-500 వంటి రష్యా రక్షణ ఉత్పత్తులను భారత్ ఒకవేళ కొనుగోలు చేస్తే.. అమెరికా నుంచి భారత్కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా” అన్న ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ.. “తమకు అవసరమైన వస్తువులను ఏ దేశం నుంచైనా కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్కు ఉంది.. జాతీయ ప్రయోజనాలకు అనుగుణమైన విదేశాంగ విధానాలను భారత్ అవలంబిస్తోంది..” అని పుతిన్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. మోదీతో సమావేశం అనంతరం అమెరికా వెళ్ళి.. రష్యాతో చమురు కొనుగోలుపై భారత్కు ఇచ్చిన వెసులుబాటును ఇక నిలిపివేయాలనుకుంటున్నాం.. అంటూ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలోనే పుతిన్ను భారత్-రష్యా-అమెరికా సంబంధాలపై పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

