ఓ వైపు శాంతి ఒప్పందం అంటూనే మరో వైపు ఇరాన్పై దాడులు ఆపటం లేదు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. నేడో రేపో మిడిల్ ఈస్ట్లో పీస్ డీల్ అమల్లోకి వస్తుందని అనుకునేలోపే పశ్చిమాసియా మళ్ళీ బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ లోని కీలక సైనిక స్థావరాలపై బాంబులు, మిసైల్స్తో విరుడుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్లోని గురుక్ నగరం, ఖేష్మ్ ద్వీపంలోని సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని స్వయంగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. అయితే.. ఇరాన్ నుంచి దాడులు ఎదురయ్యే లోపే వాటిని కావాలనే ధ్వంసం చేశామనీ.. ఈ దాడి కేవలం ఆత్మరక్షణ కోసం చేసిందేననీ అమెరికా చెప్తోంది. ఇంటర్నేషనల్ వాటర్స్పై ప్రయాణిస్తున్న తమ ఎంక్యూ 1 డ్రోన్ను కూల్చివేయడం, ఇతర దాడులకు ప్రతిస్పందనగానే తాము ఈ దాడి చేసినట్లు వెల్లడించింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, రెండు అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. వీటి నుంచి తమ యుద్ధ నౌకలకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ట్రంప్ మరో 24 గంటల్లో 60 రోజుల కాల్పుల ఒప్పందంపై స్పష్టత ఇవ్వనున్నాడంటూ వార్తలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. ఇరాన్ లోని కీలక సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తిగా ధ్వంసం చేసేంత వరకూ ట్రంప్ ఇలాగే కాలయాపన చేస్తూనే ఉంటాడనీ.. శాంతి ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యే లోపు ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీయాలనే కుట్రతోనే ట్రంప్ ఇలా ఆలస్యం చేస్తూ దాడులకు ఆదేశాలు ఇస్తున్నాడనీ అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు.
మరోవైపు.. సిరిక్ ద్వీపంలోని తమ టెలికామ్ టవర్స్పై అమెరికా దాడి చేసిందంటూ ఇరాన్ ప్రకటించింది. ఈదాడులకు ప్రతి దాడిగా అమెరికాకు చెందిన
ఎయిర్బేస్ను తాము లక్ష్యంగా చేసుకొన్నామని ప్రకటించింది. ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫైటర్స్ ప్రతిదాడి చేశారని తెలిపింది. కానీ, ఏ బేస్పై దాడి చేశారో మాత్రం వెల్లడించలేదు. అయితే అంతకు కొన్ని గంటల ముందు కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దాడులను గుర్తించి యాక్టివేట్ అయినట్లు వార్తలొచ్చాయి. హర్మూజ్ను నియంత్రించాలంటే ఇరాన్ ఖేష్మ్ మిసైల్ సిటీని కూడా ధ్వంసం చేయడం అమెరికాకు చాలా ముఖ్యం. ఇక్కడ అండర్గ్రౌండ్ సిటీలో యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులు ఉన్నాయి. జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడతారు. గడా 380, హెచ్వై-2 సిల్క్వార్మ్ను ఇరాన్ ఇక్కడ సిద్ధంగా ఉంచింది. ఇక బాలిస్టిక్ క్షిపణుల్లో 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఖియామ్-1, ఖైబర్ షెకన్, ఘద్ర, ఎమాద్ మిసైల్స్ను భద్రపర్చింది. వీటితోపాటు వేగంగా దాడి చేసే స్పీడ్బోట్స్, తీరప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఉన్నాయి. ఇరాన్లోని ఆయుధాగారాలు, సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిసైల్స్ దాచిన చోటు.. ఇలా ఒక్కొక్క దాన్ని కనిపెట్టి వాటిని నాశనం చేస్తూ వస్తోంది అమెరికా. ఇది ఇలాగే కొనసాగితే.. శాంతి ఒప్పందం కుదిరేనాటికి ఇరాన్ కనీసం ప్రతిదాడి చేసే స్థితిలో కూడా ఉండే అవకాశం లేదు.

