తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తూనే.. పాత రేషన్ కార్డులను తొలగించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. లేటెస్ట్గా రేషన్ కార్డులకు ఇన్కమ్ సర్టిఫికెట్లకు ముడిపెట్టింది. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి ఆదాయ ధృవీకరణ పత్రాల్లో వారి ఆదాయం సంవత్సరానికి 6 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. ఇక ఆ రేషన్ కార్డులను తొలగించాలని నిర్ణయించింది. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరి ఆదాయ వివరాలను సేకరించి ఆరు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు తొలగించనుంది ప్రభుత్వం. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారి వివరాలు సేకరించి వారిలో ఆరు లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న వారి వివరాలు వేరు చేసి.. వారి రేషన్ కార్డులను తొలగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంతే కాకుండా.. తెల్ల రేషన్ కార్డులను తొలగించేందుకు మరికొన్ని మార్గదర్శకాలను కూడా అమలు చేయబోతున్నట్టు సమాచారం.
గ్రామీణ ప్రాంతాల్లో మూడున్నర ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారికి.. ప్రతి సంవత్సరం ఆదాయపన్ను చెల్లిస్తున్న వారికి.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రుల నుంచి విడిగా కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి.. ఇలా కొన్ని కొత్త నిబంధనలు రూపొందించి.. అర్హత లేని వారి రేషన్ కార్డులను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో చాలా మంది 6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయంతో పాటు రకరకాల ఆస్తులు కలిగి ఉండి కూడా తెల్ల రేషన్ కార్డులను కలిగి ఉన్నారని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ తెల్ల రేషన్ కార్డులతోనే.. వారికి అర్హత లేకపోయినా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని.. నిజమైన అర్హులకు నష్టం వాటిల్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం అమలైతే చాలా వరకు తెల్ల రేషన్ కార్డులు రద్దు కావటం ఖాయం.
