ఆధార్ కార్డ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్పై యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే యాప్ విషయంలో చాలా మార్పులు అవసరం అని భావించిన ఈ సంస్థ.. పాత యాప్ను మొత్తానికే ప్లే స్టోర్ నుంచి తొలగించాలనీ.. పాత యాప్ డీయాక్టివేట్ చేసి దాని స్థానంలో సరికొత్త యాప్ తీసుకురావాలని నిర్ణయించింది. వినియోగదారులకు కట్టుదిట్టమైన భద్రత, పర్సనల్ డేటాపై నియంత్రణ, ఆధునిక డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ స్పష్టం చేసింది. వినియోగదారులందరూ కొత్త యాప్కు మారాలని కోరింది. ఈ మేరకు ఎక్స్లో యూఐడీఏఐ ఓ పోస్ట్ పెట్టింది. ఆధార్ యాప్ పాత వర్షన్లో ఏదైనా వెరిఫికేషన్ విషయానికొచ్చే సరికి పూర్తి ఆధార్ వివరాలను చూపించేది. కానీ.. ఇలా చూపించటం వల్ల వ్యక్తిగత వివరాల భద్రతకు ముప్పుందని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఆధార్ యాప్ విధానాన్ని మార్చేయాలని నిర్ణయించుకుంది.
కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆధార్ కొత్త యాప్ను ప్రారంభించింది. ఆ తర్వాత పూర్తిస్థాయి వెర్షన్లను అప్గ్రేడ్ చేసింది. ఎంఆధార్ యాప్కు ప్రత్యామ్నాయంగా కాకుండా రోజువారీ జీవితంలో ఆధార్ ధృవీకరణ, గుర్తింపును పంచుకునే విధానాన్ని ఇది మారుస్తుంది. అయితే కొత్త యాప్లో క్యూఆర్ షేరింగ్, ఫేస్ అధెంటికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్ అనేది అది పెద్ద మార్పుల్లో ఒకటి. కొత్త యాప్లో క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ ద్వారా అవసరమైన ఆధార్ సమాచారాన్ని మాత్రమే వినియోగదారులు పంచుకోవచ్చు. పూర్తి ఆధార్ వివరాలను బహిర్గతం చేయకుండా అవసరమైన వివరాలను మాత్రమే క్యూఆర్ కోడ్ విధానం ద్వారా పంచుకోవచ్చు. ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రులు, హోటళ్లు, ఇతర చోట్ల ఆధార్ అవసరమైన చోట ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఇక ఇప్పటివరకు ఆధార్ యాక్సెస్ ఓటీపీ ధృవీకరణ ద్వారా జరిగేది. కానీ కొత్త యాప్లో ఓటీపీతో పాటు ఫేస్ రికగ్నిషన్, క్యూఆర్ ధృవీకరణ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, డిజిటల్ యాక్సెస్ను మెరుగుపర్చేందుకు ఈ కొత్త సౌకర్యం ప్రవేశపెడుతున్నారు. ఇక ఈ యాప్ ద్వారా సులువుగా బయెమెట్రిక్ లాక్ చేసుకోవడంతో పాటు మొబైల్ నెంబర్, అడ్రస్ లాంటివి సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త యాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది
