తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా నడుస్తున్న ఎగ్జిబిటర్ల పర్సెంటేజీ వివాదం.. పెద్ది సినిమా విడుదల సందర్భంగా మరోసారి కీలక అంశంగా మారింది. పర్సెంటేజ్ ప్రకారమైతేనే పెద్ది సినిమాను ఆడిస్తామనీ.. లేకపోతే థియేటర్లలో సినిమా ఆడే ప్రసక్తే లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం ప్రకటించారు. పెద్ది సినిమాకు పర్సెంటేజీ ఇచ్చేది లేనిది ఇప్పుడే తేల్చాలనీ.. వాయిదా వేస్తే సినిమా ఆడించే ప్రసక్తే లేదని పట్టుబట్టారు. ఫిల్మ్ చాంబర్ కమిటీతో ఇప్పటికే ఎన్నో సార్లు చర్చలు జరిగాయనీ.. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో కూడా రెండు నెలల్లో పర్సెంటేజ్ సమస్య క్లియర్ చేస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారనీ తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సెక్రెటరీ శ్రీధర్ ఈ సమావేశంలో గుర్తు చేశాడు. రెండు నెలలని చెప్పి సంవత్సరం గడిచినా పర్సెంటేజీ విధానంపై నిర్మాతలు ఎటూ తేల్చకుండా తమను నష్టాలపాలు చేస్తున్నారని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో సుమారు 120 మంది థియేటర్ల యజమానులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారనీ.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉందన్నారు. పదేళ్ళ క్రిందట సినిమా థియేటర్లకు భారీ లాభాలు వచ్చేవనీ.. ఇప్పుడు థియేటర్లకు ఆదాయం పడిపోయిందన్న శ్రీధర్.. నిర్మాతలకు మాత్రం ఒక్క సినిమా మీద ఎన్నో రకాలుగా ఆదాయం వస్తోందన్నారు. రెంటల్ సిస్టమ్ ఇక ఒప్పుకోమనీ.. థియేటర్ల గ్రేడింగ్ పేరుతో తేడాలు చూపించినా ఒప్పుకోమని తేల్చి చెప్పారు. చిరంజీవిని కలిసి తమ కష్టాలను చెప్పుకుంటామనీ.. తమ సమస్య పరిష్కరించేందుకు చిరంజీవి ముందుకు రావాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. కరెక్టుగా పెద్ది సినిమా రిలీజ్ సమయంలో ఎగ్జిబిటర్లు మొండి పట్టు పట్టడంతో సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
పెద్ది సినిమా యూనిట్కు మరో ఎదురుబెద్ద తగిలింది. ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచుకోటానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. తెలంగాణలో మాత్రం ఈ సినిమా టికెట్ రేట్లు పెంచటానికి అనుమతి రానట్టు సమాచారం. గతంలో పెద్ద సినిమాలకు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచటంపై చాలా రకాల వివాదాలు చెలరేగటంతో పెద్ది సినిమాకు టికెట్ రేట్లు పెంచే అవకాశం కనిపించటం లేదు. టికెట్ రేట్ల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ ఎగ్జిబిటర్ల స్ట్రైక్తో పెద్ది సినిమా విడుదలపైనే సందిగ్ధత నెలకొంది.
