దృశ్యం, దృశ్యం2 సినిమాలు అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచిన విషయం తెలిసిందే. అదే జానర్లో సీక్వెల్గా తెరకెక్కిన దృశ్యం 3 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహన్ లాల్, మీనా, అన్సిబ హసన్, ఎస్తేర్ అని, బిజూ మీనన్ తదితరులు ప్రధాన పాత్రలుగా వచ్చిన దృశ్యం 3.. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. ఈ సీక్వెల్ ఇంతకు ముందు సినిమాలను మించి థ్రిల్ చేసిందా.. రివ్యూలో చూద్దాం
దృశ్యం సినిమాలో క్లైమాక్స్లో అంతా అయిపోయింది అనుకుంటే.. అదే కథలోంచి మరి కొన్ని కోణాలు సృష్టించి.. కథ ఇంకా అయిపోలేదు అన్నట్టుగా దృశ్యం 2 తెరకెక్కించారు. దృశ్యం 2లో వరుణ్ హత్యకేసు కొట్టేయటంతో అంతా అయిపోయింది అనుకుంటే.. అదే కథను మరింత పొడగించి మరిన్ని కొత్త కోణాలు జోడించి దృశ్యం 3 తెరకెక్కించారు. అయితే.. ఒక కథకు పొడగింపుగా తెరకెక్కినా.. పాత కథను మరిపించేలా కొత్త కథలను తీర్చిదిద్దారు. దృశ్యం 3 కూడా అలాగే రెండో భాగానికి కొనసాగింపుగా తెరకెక్కించినా.. ఇందులో పూర్తిగా కొత్త అంశాలను చూపించాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. వరుణ్ హత్యకేసు కొట్టేయటంతో ఇక అంతా ముగిసిందని అనిపిస్తుంది. కేసు నుంచి బయటపడిన జార్జ్ మరియు అతడి ఫ్యామిలీ సంతోషంగా బతికేస్తుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత జార్జ్ తన జీవితంలో జరిగిన వరుణ్ కథనే సినిమాగా తీసి భారీ విజయం సాధిస్తాడు. అదే ఆనందంలో తన పెద్ద కూతురు అంజుకు పెళ్ళి ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ చూసిన ప్రతి సంబంధం తప్పిపోతూ ఉంటుంది. చివరిదాకా వచ్చిన సంబంధాలు ఎందుకు తప్పిపోతున్నాయి అని ఆలోచనలో పడిన జార్జ్.. ఈ విషయంలో తన శతృవుల పాత్ర ఉందని తెలుసుకుంటాడు. ఆ శతృవులు ఎవరు.. అంజు పెళ్ళిని వారు ఎందుకు అడ్డుకుంటున్నారు.. అంజును జైలుకు పంపించాలని ఎందుకు కక్ష కట్టారు. శతృవుల కుట్రల నుంచి తన కుటుంబాన్ని మరోసారి జార్జ్ ఎలా కాపాడుకుంటాడు అనేదే కథ.
అయితే.. దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లో ఉన్నంత కథాబలం మూడో పార్ట్లో కనిపించలేదు అనిపిస్తుంది. రీమేక్ సినిమాకు డబ్బింగ్ సినిమాకు ఉండే తేడా ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రలు ఎలాగో ప్రేక్షకులకు ఇదివరకే పరిచయం కాబట్టి మొదటి, రెండో పార్ట్లను నామమాత్రంగా పరిచయం చేసి మూడో కథలోకి వచ్చేసినా.. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త నెమ్మదిగానే సాగినట్టు అనిపిస్తుంది. జార్జ్ తన కూతురుకు పెళ్ళి సంబంధాలు చూడటం.. అవి కాస్తా క్యాన్సిల్ కావటం చాలా మామూలుగానే అనిపించినా.. దీని వెనుక కుట్ర ఉందని జార్జ్కు అర్థమయ్యే దాకా సినిమా స్లోగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే జార్జ్కు అసలు విషయం తెలుస్తుందో.. అప్పుడు అతడి వేట మొదలవుతుంది. అక్కడి నుంచి కథ స్పీడ్ పెరుగుతుంది. ఇంటర్వెల్కు ముందు ఓ థ్రిల్లింగ్ సీన్ ఇచ్చి ఫస్ట్ హాఫ్ ముగించాడు డైరెక్టర్.
మొదటి రెండు పార్ట్లు చూసేశాం కాబట్టి.. జార్జ్పై కుట్ర చేస్తున్నది ఎవరా అన్నది ప్రేక్షకులను టెన్షన్ పెడుతుంది. వరుణ్ కుటుంబమా.. పగతో రగిలిపోతున్న మాజీ పోలీసులా.. కొత్త శతృవులు ఎవరైనా ఉన్నారా అని ప్రేక్షకులు సస్పెన్స్ ఫీల్ అవుతారు. శతృవుల కుట్రలను జార్జ్ తిప్పికొట్టే తీరు ప్రేక్షకులను నిజంగానే మంచి థ్రిల్ ఇస్తుంది. మొదటి రెండు భాగాల్లోలాగానే జార్జ్ క్యారెక్టర్ మోస్ట్ ఇంటలిజెంట్గా కనిపిస్తుంది. శతృవులు ఎంతటి బలవంతులో.. అంత కంటే ఎక్కువ తెలివితేటలతో జార్జ్ తన ఫ్యామిలీని కాపాడుకునే తీరు ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు సూపర్గా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. కాకపోతే.. ఇప్పటికే ప్రేక్షకులు రెండు పార్ట్స్ చూసేశారు కాబట్టి మూడో పార్ట్పై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలను అందుకోవటంలో దృశ్యం 3 కాస్త నిరాశపరిచిందని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్.. మొదటి రెండు భాగాల్లో కంటే కాస్త తక్కువ మార్కులు దక్కించుకుంది. ఇక్కడితో కథ అయిపోలేదు.. ఇంకా ఉంది అన్నట్టు నాలుగో పార్ట్పై డైరెక్టర్ చిన్న హింట్ ఇచ్చి కథ ముగించేశాడు.
మోహన్ లాల్ మీనా సహా అందరూ తమ క్యారెక్టర్లకు తగినట్టు అద్భుతంగా నటించారు. ఒకే కథకు మూడో సీక్వెల్ చేయటం.. దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయటం అంత సులభమైన పని కాదు. కానీ డైరెక్టర్ జీతూ అందులో విజయం సాధించాడు. టేకింగ్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. సస్పెన్స్ రివీల్ చేసే విధానం.. ఒక సీన్ను నెక్స్ట్ సీన్కు కనెక్ట్ చేసే విధానం.. క్యారెక్టర్లను హైలెట్ చేసే విధానం అన్నీ సూపర్గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న ఒకే ఒక్క మైనస్ తప్ప మిగతాదంతా సూపర్గా ఉందని చెప్పాలి.
