లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ సక్రమంగా చెల్లించలేని సమయంలో ఎక్కడలేని తలనొప్పులు మనకు తెలిసిందే. ఒక్క ఈఎంఐ మిస్ అయితే చాలు.. కస్టమర్ కేర్ నుంచి కాల్స్.. ఫోన్కు మెసేజ్లు.. పెనాల్టీ చార్జీలు చెల్లించాలనీ.. చెక్ బౌన్స్ చార్జీలు చెల్లించాలని కాల్స్ చేసి విపరీతంగా విసిగిస్తుంటారు. ఇక వరుసగా ఈఎంఐలు మిస్ అయితే.. రికవరీ వాళ్ళ వేధింపులు మాటల్లో చెప్పతరం కాదు. కాల్స్ చేసి బెదిరించటం.. చుట్టాలకు ఫోన్ చేసి మన పరువు తీయటం.. ఇంటికి వచ్చి గూండాయిజం చేయటం.. ఇలా నరకం చూపిస్తారు. చివరికి ఇంట్లో సామాను ఎత్తుకెళ్తామని కూడా బెదిరిస్తారు. ఇంటి ముందు గొడవ చేసి పరువు తీసి లోన్ రికవర్ చేయటానికి ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి వారి నుంచి లోన్ తీసుకున్న వారికి ఓ రక్షణ కల్పించేందుకు ఆర్బీఐ ఓ కొత్త చట్టాన్ని తీసుకురానుంది. లోన్ల రికవరీ పేరుతో కస్టమర్లను వేధించే బ్యాంకులకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. ఈమేరకు ‘కండక్ట్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ రికవరీ ఏజెంట్స్’ పేరుతో కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. దీనిపై మే 31 వరకు వాటాదారులు, ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమలు చేయనుంది.
పర్సనల్ లోన్.. వెహికిల్ లోన్.. హోమ్ లోన్.. వంటి చాలా రకాల లోన్ల విషయంలో లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో లోన్ చెల్లించని పక్షంలో బ్యాంకులు పలు అధికారాలు కలిగి ఉంటాయి. అవేవీ లోన్లు తీసుకున్న వారికి సక్రమంగా తెలియక.. రికవరీ ఏజెంట్లు చెప్పే మాటలకు భయపడిపోతుంటారు. కానీ ఇక అది సాగదు.
లోన్ తీసుకున్న వారి మొబైల్ఫోన్ను లాక్ చేయడం, దాని ఫీచర్లను నిలిపివేయడం వంటివి బ్యాంకులు చేయకూడదని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ను కొనుగోలు చేయడానికి సదరు బ్యాంకే లోన్ ఇచ్చి ఉంటే, అప్పుడు మాత్రమే ఫోన్ ఫీచర్లను నిలిపివేసే హక్కు బ్యాంకుకు ఉంటుందని ఆర్బీఐ స్పష్టంచేసింది. అది కూడా సదరు లోన్ బకాయి పడి 90 రోజుల గడువు దాటి ఉండాలి. కస్టమర్లకు నోటీసులు ఇచ్చినా స్పందించని సందర్భాల్లోనే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఫోన్ బ్లాక్ చేసినప్పటికీ.. ఇంటర్నెట్, ఇన్కమింగ్ కాల్స్, అత్యవసర సేవలు, ప్రభుత్వ ఎమర్జెన్సీ అలర్టులు నిలిపివేయకూడదని పేర్కొంది. ఒకవేళ కస్టమర్ తన బకాయిని చెల్లిస్తే గంటలోనే ఫోన్పై ఉన్న ఆంక్షలు తొలగించాలి. ఆలస్యమైతే గంటకు రూ.250 చొప్పున బ్యాంకే తిరిగి రుణగ్రహీతకు పరిహారంగా చెల్లించాలి. ఇక ఆర్బీఐ తీసుకొచ్చిన మరో విప్లవాత్మక మార్పు ఏమిటంటే.. రికవరీ ఏజెంట్లు లోన్ తీసుకున్న వారికి చేసే ప్రతీ కాల్ ను బ్యాంకులు రికార్డు చేయాల్సిందే.
అలాగే వారు చేసే ఆడియో, టెక్ట్స్ సంభాషణలను భద్రపరచాలని బ్యాంకులకు సూచించింది. కాల్ చేసి బూతులు తిట్టడం.. బెదిరింపులకు పాల్పడటం.. ఇష్టమొచ్చినట్టు మెసేజ్లు చేయటం.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం.. చుట్టాలకు కాల్స్ చేసి పరువు తీయటం.. ఇలాంటివి చేస్తే లోన్ తీసుకున్న వారికి బ్యాంకుపై కేసులు వేసే హక్కు కల్పించనుంది ఆర్బీఐ.
