ఎంఎస్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ను ఐపీఎల్ కింగ్గా నిలబెట్టిన ప్లేయర్. ఏకంగా 5 సార్లు సీఎస్కేకు కప్పు అందించిన కెప్టేన్. అలాంటి ధోనీ.. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవటం అభిమానులకు ఎంతో నిరాశ కలిగించింది. కనీసం చివరి ఓవర్ బ్యాటింగ్ చేస్తాడేమోనని అందరూ ఆశగా ఎదురు చూశారు.. కానీ ధోనీ చేయలేదు. ఇప్పుడు ధోనీ చేసిన మరో పని ఫ్యాన్స్ను కన్ఫ్యూజన్లో పడేసింది. సీఎస్కే చివరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్లో ఆడనుంది. ఈ నేపథ్యంలో ధోనీ అహ్మదాబాద్ వెళ్ళకుండా రాంచీ వెళ్ళినట్టు వార్తలు రావటం ఫ్యాన్స్కు షాకిచ్చింది. ధోనీ అహ్మదాబాద్ వెళ్ళకుండా రాంఛీ వెళ్ళాడంటే దాని అర్థం ఇక ధోనీ చివరి మ్యాచ్ కూడా అడడేమో అంటూ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.
అయితే హడావుడిగా ధోనీ రాంఛీకి ఎందుకు వెళ్ళాడు అనే దానిపై ఎక్కడా క్లారిటీ లేదు. చివరి మ్యాచ్ ఆడకుండా వదిలిపెట్టాడా.. లేక మ్యాచ్ టైమ్కు మళ్ళీ వస్తాడా అనేదానిపై సీఎస్కే నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం సీఎస్కే 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. తన చివరి మ్యాచ్లో విజయం సాధిస్తే 14 పాయింట్లు అవుతాయి. అప్పుడు ఆర్ఆర్, పంజాబ్, కేకేఆర్ తమ ఆఖరి పోరులో ఓడితే సీఎస్కే ప్లేఆఫ్స్కు చేరే అవకాశం ఉంది. ఒకవేళ నాకౌట్కు చెన్నై చేరితే ధోని ఆడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సీఎస్కే ఎలిమినేటర్ మ్యాచ్లోనే ఆడాల్సిఉంటుంది. మే 27న ముల్లన్పుర్ వేదికగా ఎలిమినేషన్ జరగనుంది. ఐపీఎల్ తొలి సీజన్లో ఆడిన నలుగురు ప్లేయర్లు ధోని మినహా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మనీశ్ పాండే మాత్రమే ప్రతి సీజన్లో కనీసం ఒక్క మ్యాచ్ ఆడారు. ఈ లిస్ట్లో ధోని చేరాలంటే ఈ ఆఖరి మ్యాచ్లో లేదా ప్లేఆఫ్స్కు చేరుకుంటే అందులోనైనా ఆడాలి. ఆడకపోతే మాత్రం ధోని ఆ ముగ్గురు సాధించిన రికార్డును అందుకోలేడు. రికార్డుల సంగతి పక్కనపెడితే.. ఎప్పటి నుంచో ధోనీని పిచ్ఫై బ్యాటింగ్ చేస్తుంటే చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం నిరాశ తప్పదు.
