దేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు నిజమైన ప్రమాదాలు కావనీ.. అవన్నీ కావాలని ఎవరో చేశారంటూ రైల్వే శాఖ సంచలన నివేదిక బయటపెట్టింది. ఇటీవల రాజస్థాన్లోని అమర్పుర, కోటా, బిహార్లోని ససరాం, బెంగాల్లోని హౌరాలో నాలుగు వేర్వేరు రైళ్లలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో దర్యాప్తు నిర్వహించగా.. పలు కీలక విషయాలు బయటపడినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. పక్కా ప్లాన్ ప్రకారం ఒక చైన్ నెట్వర్క్ లేదా ఏదైనా టెర్రర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే ఈ ప్రమాదాలు జరిగాయని స్పష్టం చేసింది. గతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళపై జరరిగిన దాడులకు.. ఇటీవలి కాలంలో రైళ్ళలో జరుగుతున్న అగ్నిప్రమాదాలకు ఏదైనా సంబంధం ఉందా.. లేక.. ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ ఈ ప్రమాదాలకు కారణమా అన్న కోణంలో రైల్వే శాఖ అంతర్గత విచారణ చేయగా.. నమ్మలేని ఎన్నో ఆధారాలతో కూడిన విషయాలు బయటపడ్డాయని అధికారులు చెప్తున్నారు.
అమరపుర రైల్వే అగ్నిప్రమాద ఘటనలో బెడ్డింగ్ మెటీరియల్ తగలబడి పోవటం వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కానీ.. రైల్వే శాఖ ప్రత్యేక విచారణ బృందం చేపట్టిన అంతర్గత విచారణలో నమ్మలేని విషయాలు వెలుగుచూశాయి. ఈ అగ్నిప్రమాదం జరిగిన బోగీలో.. పెట్రోల్లో ముంచిన ఓ గుడ్డ ముక్క లభించిందనీ.. ఈ గుడ్డముక్కతోనే బెడ్డింగ్ మెటీరియల్కు నిప్పు పెట్టి అగ్నిప్రమాదానికి కారణమయ్యారని చెప్తున్నారు. హౌరాలో జరిగిన రైలు ప్రమాదంలో కూడా ఇలాగే పెట్రోల్లో ముంచిన క్లాత్ను తగలబడిన బోగీ బాత్రూమ్లో గుర్తించినట్లు వెల్లడించింది. కోటాలోని రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో సైతం బాత్రూమ్ నుంచే మంటలు మొదలైనట్లు గుర్తించామని పేర్కొంది. ససరాంలో ఖాళీ బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మండే వస్తువును విసిరినట్లు దర్యాప్తులో తేలిందని రైల్వే శాఖ తెలిపింది. ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయటంతో పాటు దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతోనే ఈ ప్రమాదాలు సృష్టిస్తున్నట్టు తాము భావిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దర్యాప్తులో బయటపడిన మరో దారుణమైన విషయం ఏమిటంటే.. కుట్రు చేసిన వాళ్ళు ప్రమాదంలో వీలైనంత ఎక్కువ ఆస్తి మరియు ప్రాణనష్టమే లక్ష్యంగా దారుణానికి పాల్పడ్డారని బయటపడింది. వేసవి కాలం వేడి తీవ్రత వల్ల అగ్నిప్రమాదం జరిగినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టు స్పష్టంగా తెలుస్తోందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ వరుస ఘటనలకు సంబంధించిన అనేక ఆధారాలను సేకరించామనీ.. వీటికి బాధ్యులైన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక మీదట కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదన్నారు. రైలు ప్రయాణికులు వీలైనంత అప్రమత్తంగా ఉండాలనీ.. ఎవరైనా అనుమాస్ఫదంగా కనిపిస్తే వెంటనే రైల్వే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని హెచ్చరిస్తున్నారు.
