మంగళవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. జమ్మూ కశ్మీర్ దోడాలో గల భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించటంతో వణికిపోయిన జనం ఇళ్ళు, అపార్ట్ మెంట్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలోని ప్రజలు కొన్ని గంటల పాటు రోడ్లపైనే నిల్చుండిపోయారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. సుమారు రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా స్వల్ప భూకంపం ఉత్తర భారతదేశంలో సంభవించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఉన్న ప్రాంతంలో భూమి కింద తరచుగా భూపటలంలో కదలికలు ఏర్పడుతుండటమే అప్పుడప్పుడు సంభవిస్తున్న ఈ భూకంపాలకు కారణం అయ్యి ఉండవచ్చని అధికారులు చెప్తున్నారు.