ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఫోన్ కాల్ తో యూపీ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పేరుమోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ హత్య జరిగినప్పటి నుంచి ఇలాంటి బెదిరింపులు వినిపిస్తున్నా.. ఇప్పుడు నేరుగా యోగీనే హతమారుస్తామంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. అతీక్ ను చంపినందుకు ప్రతీకారంగా భారత్ పైనా.. ఉత్తర్ ప్రదేశ్ పైనా దాడులు చేస్తామంటూ ఇదివరకే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థల నుంచి హెచ్చరిక లేఖలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని మోడీ కేరళ పర్యటనపై కూడా ఇలాంటి లేఖనే బీజేపీ కార్యాలయానికి వచ్చింది. ఇప్పుడు యూపీ సీఎంకు ఇదే తరహా లేఖ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఇంటలిజెన్స్ వ్యవస్థ.. యూపీలో జరిగే చీకటి వ్యవహారాలపై నిఘా పెంచింది. యోగీ చుట్టూ భద్రత వలయాన్ని మరింత కట్టుదిట్టం చేసింది.
ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన రాజుపాల్ ను హత్య చేయించినందుకు గానూ అతీక్ అహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరచగా యావజ్జీవ శిక్ష విధించిన అనంతరం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిథుల ముసుగులో ముగ్గురు వ్యక్తులు అతీక్ తో పాటు అతడి సోదరుడు అష్రఫ్ ను తుపాకీతో కాల్చి చంపేశారు. అయితే.. ఈ హత్య వేరెవరో చేసింది కాదనీ.. యూపీ పోలీసులతో సీఎం యోగీ కలిసి కుట్ర పూరితంగా చంపించాడనీ వార్తలు వచ్చాయి. ఇది అబద్ధమనీ.. అతీక్ మరియు అతడి సోదరుడిని చంపింది అతడితో చీకటి సంబంధాలు కలిగి ఉన్న మాఫియానే అని తర్వాత తెలిసి వచ్చింది. అయినా సరే అతీక్ ను చంపింది యోగీయే అంటూ బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. కశ్మీర్ లో జరగాల్సిన జీ-20 సదస్సుపై కూడా అతీక్ హత్యతో అనుమానాలు మేఘాలు కమ్ముకున్నాయి. యూపీలో శాంతి భద్రతల విషయంలో యోగీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. కశ్మీర్ లో జరగాల్సిన జీ-20 సదస్సు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.