HomeNATIONAL NEWSఅతీక్ అహ్మద్ స్నేహితుడి కోసం జైలు రూల్స్ మార్చేసిన నితీష్ కుమార్

అతీక్ అహ్మద్ స్నేహితుడి కోసం జైలు రూల్స్ మార్చేసిన నితీష్ కుమార్

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

ఉత్తర ప్రదేశ్, బిహార్.. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయం, రౌడీయిజం అవిభక్త కవలలు. ఒకటి లేకుండా మరొకటి మనుగడ సాగించడం కష్టం. సొంత ప్రయోజనాలకోసం రాజకీయనాయకులకు అండగా మాఫియా, గెలిచిన తర్వాత ఆ నేరప్రపంచానికి సపోర్ట్‌గా అక్కడి ప్రభుత్వాలు వ్యవహరిస్తాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట. ఐతే, యూపీలో యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మారింది. రాజకీయానికీ, మాఫియాకీ మధ్య యుద్ధం మొదలైంది. క్రిమినల్స్ అక్రమాస్తులపై బుల్డోజర్లు ఎప్పుడైతే గేరు మార్చి దూసుకెళ్లాయో అప్పుడే యూపీలో రక్తపు మరకలు మాయమవడం మొదలైంది. తాజాగా మాఫియాను మట్టిలో కలిపేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటన తర్వాత ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తూనే ఉంది. కానీ, బిహార్‌లో మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రజలు సుశాసన్‌ బాబుగా పిలుచుకునే మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌.. ఓ నటోరియస్ క్రిమినల్‌ను జైల్ నుంచి తప్పించేందుకు చేయని ప్రయత్నం అంటూ కనిపించడం లేదు. ఏకంగా చట్ట సవరణకు కూడా వెనుకాడలేదంటే సీన్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇంతకీ నితీష్ తెగ ప్రయత్నాలు చేస్తున్న ఆ క్రిమినల్ పేరు ఆనంద్ మోహన్. ఇతడేమీ పొరపాటున క్రైమ్‌ చేసి ఇరుక్కున్న రాజకీయ నేత కాదు. సాక్షాత్తూ ఓ జిల్లా కలెక్టర్‌నే పట్టపగలు నడిరోడ్డుపై నరికిచంపించిన నరరూప రాక్షసుడు. ఆ చనిపోయిన కలెక్టర్ మన తెలుగోడే. 1994లో బిహార్‌ పీపుల్స్‌ పార్టీ నేత, గ్యాంగ్‌స్టర్‌ చోటాశుక్లా పోలీస్‌‌ ఎన్‌కౌంటర్‌ లో చనిపోయాడు. అతడి అంత్యక్రియల సమయంలో బిహార్‌లో పెద్దఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో గోపాల్‌‌గంజ్‌ కలెక్టర్‌గా తెలుగు దళిత ఐఏఎస్‌ జి.కృష్ణయ్య ఉన్నారు. కారులో వెళుతున్న ఆయన్ను అందరూ చూస్తుండగానే బయటకు లాగి రాళ్లతో కొట్టించి కత్తితో నరికించి మరీ హత్య చేయించాడు ఆనంద్‌మోహన్. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో అతడు నిందితుడు. ఫలితంగా కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. తర్వాత దాన్ని యావజ్జీవ కారాగారశిక్షగా మార్చింది. ఆనంద్‌‌మోహన్‌ జైల్లోనే ఉన్నా అక్కడి నుంచే వ్యవహారాలను చక్కబెట్టాడు. రాజకీయాన్ని నడిపాడు. జైలు నుంచే ఎంపీగా పోటీ చేసి మరీ గెలిచాడు. అయితే మరణశిక్ష పడటంతో పోటీకి దూరమయ్యాడు. స్వతంత్ర భారతంలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నేత కూడా ఈ నటోరియస్ క్రిమినలే. ఆ తర్వాత తన భార్యను ఎన్నికల బరిలోకి దింపాడు. ఇప్పుడు ఆనంద్‌మోహన్ భార్య, కొడుకు ఇద్దరూ ఎమ్మెల్యేలే.. ఇంతటి నేరచరిత్ర ఉన్న ఆనంద్‌మోహన్‌ను జైలు నుంచి బయటకు తీసుకురావాలన్నది నితీశ్‌ కుమార్ ప్రయత్నం. అందుకే జైలు మాన్యువల్‌ సైతం మార్చేశారు.
ఆనంద్‌మోహన్‌ కోసం నితీశ్ ఇంతలా ఆరాటపడ్డానికి రీజన్ లేకపోలేదు. ఈ నటోరియస్ క్రిమినల్.. తోమర్‌ రాజ్‌పుట్‌ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ వర్గంలో ఇప్పటికీ పలుకుబడి కలిగిన నేత. యువతలో నేటీకీ రాబిన్‌హుడ్ ఇమేజ్ ఉంది. వీటన్నింటికీమించి జైలు నుంచే తన నేర సామ్రాజ్యాన్ని ఎలాంటి చీకూ చింతా లేకుండా నడుపుతున్నవాడు. అందుకే, బిహార్ రాజకీయాల్లో ఆనంద్‌మోహన్‌కు అంత డిమాండ్. ఈ ఏడాది జనవరిలో జేడీయూ రాజ్‌పుట్‌ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఆ సమయంలో ఆనంద్‌ మోహన్‌ను విడుదల చేయాలని నినాదాలు చేశారు అతడి అభిమానులు. సాధారణంగా ఏ రాజకీయ నేత ఇలాంటి క్రిమినల్‌ గురించి ప్రస్తావించడానికి ఇష్టపడరు. కానీ, బిహార్ సీఎం మాత్రం మీరు ఆందోళన చెందకండి.. నేను చేయాల్సింది చేస్తున్నా అంటూ ఆనంద్‌మోహన్ విడుదల ప్రయత్నాలను బయటపెట్టారు.
ప్రస్తుతం ఈ నటోరియస్ క్రిమినల్ తన కుమారుడి వివాహ వేడుకల కోసం పెరోల్‌పై ఉన్నాడు. అంతకుముందు కూతురి పెళ్లంటూ బయటకొచ్చాడు. ఆనంద్‌మోహన్‌ను జేడీయూ అధ్యక్షుడు కౌగిలించుకుని స్వీట్ తినిపిస్తున్న ఫోటో వైరల్‌ కూడా అయ్యింది. వాస్తవానికి.. ఏ ప్రభుత్వ అధికారిని హత్య చేసినా పెరోల్‌ అనే మాటకే ఆస్కారం ఉండదు. కానీ, వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టుగా.. కేవలం ఆనంద్‌ను బయటకు తీసుకురావడానికి ఏకంగా చట్టాన్నే సవరించింది నితీశ్‌ సర్కార్. నిజానికి 2021లో ఆనంద్‌మోహన్‌ శిక్ష రద్దు చేయాలన్న పిటిషన్‌ను నితీశ్‌ తోసిపుచ్చారు. ఎందుకంటే అప్పుడు బీజేపీ మిత్రపక్షం. కానీ ఇప్పుడు ఆర్జేడీతో కాపురం చేస్తున్నారు నితీశ్ కుమార్. ఆనంద్‌మోహన్‌ భార్య, కొడుకు ఇద్దరూ ఆర్జేడీ ఎమ్మెల్యేలే… ఆ మిత్రబంధం కోసం రౌడీషీటర్‌ను బయటకు తీసుకొచ్చేందుకు మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ను సైతం రితీశ్ కుమార్ పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది.
బీజేపీతో ఉన్నంతకాలం నితీశ్ కుమార్ హిందుత్వాన్ని అడ్డుపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ఓ వైపు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు తన సొంత సామాజికవర్గం అయిన కురిమిలో కూడా నితీశ్ ప్రాబల్యం తగ్గుతోంది. బీహార్‌లో వీరి జనాభా కేవలం ఐదుశాతమే. కానీ ఇప్పుడు వారిలో కూడా మార్పు వచ్చింది. ఆ కమ్యూనిటీలో కొంతమేర కమలం వైపు చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నితీశ్‌కు ఒకప్పుడు నమ్మకమైన మిత్రుడు ఉపేంద్ర కుశ్వాహా పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఇది బిహార్ సీఎంకు కోలుకోలేనిదెబ్బ. ఇక బిహార్‌లో బలమైన యాదవ, ముస్లిం వర్గాలు ఆర్జేడీకి మద్దతుగా నిలుస్తున్నాయి. నితీష్‌ను దించేసి తేజస్విని సీఎం సీటులో కూర్చోబెట్టాలని భావిస్తున్న ఆ వర్గాల సపోర్ట్‌ నితీశ్‌కు ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఇక ముస్లింలు 2020లో నితీశ్‌కు ఎంత నష్టాన్ని చేసారో ఆయనకు గుర్తుంది. అందుకే, మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ను పక్కనపెట్టి పొలిటికల్ ఈక్వేషన్లపై నితీశ్ ఫోకస్ చేశారనే చర్చ జరుగుతోంది. ఇక ఆనంద్‌మోహన్‌ను రిలీజ్ చేసేందుకు జైలు మాన్యువల్ సవరించడాన్ని అక్కడి విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. నితీశ్ ప్రభుత్వ చర్యను దళిత వ్యతిరేకతగా అభివర్ణించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. మిగిలిన వారిదీ అదే మాట.
2024లో విపక్షాల ప్రధాని అభ్యర్థిత్వం కోసం నితీశ్ పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్షాల ఐక్యతను కూడా నెత్తికెత్తుకున్నారు. ఇదే సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా ప్రధాని అభ్యర్ధి రేసులో వినిపిస్తోంది. యోగి యాక్షన్‌నే కమలం పార్టీ పెద్దలు ఎన్నికల నినాదాలుగా మార్చుకోవడమే ఇందుకు ఉదాహరణ. బుల్డోజర్, డబుల్ ఇంజిన్ సర్కార్‌ నినాదాలన్నీ యోగి ఆదిత్యనాథ్‌వే. మోడీ ఇమేజ్‌తోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లినా ఆ తర్వాత ఎలాంటి మార్పులయినా జరగొచ్చనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో క్రిమినల్స్‌పై యోగి, నితీశ్ యాక్షన్‌ను కంపేర్ చేస్తున్నారు. ఓ వైపు యోగి నేరగాళ్ల అంతుచూస్తుంటే.. మరోవైపు నితీశ్ వారికి కొమ్ముకాస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. దీంతో ఈ పరిణామాలన్నీ బీజేపీకి పాజిటివ్‌గా మారుతుంటే నితీశ్‌ యాక్షన్ విపక్షాలకు కూడా మైనస్ అయ్యే ప్రమాదముందనే చర్చ జరుగుతోంది. మరి ఆనంద్‌మోహన్ ఎపిసోడ్‌లో బిహార్ సీఎం వైఖరి చివరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...