ఉత్తర్ ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్లు అతీక్ అహ్మద్, అష్రఫ్ లు హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా ప్రతినిథుల వేషాల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు పోలీసుల కళ్ళెదుటే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చి చంపటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య జరిగిన వెంటనే ఇది పోలీసులు కావాలని చేసిన ఫేక్ ఎన్ కౌంటర్ అనీ.. యోగీ సర్కార్ కావాలనే ఈ హత్యలు చేయించిందనీ వార్తలు వచ్చాయి. కానీ.. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులకు ఊహించని విషయాలు తెలిసాయి. విచారణలో ముగ్గురు నిందితుల నుంచి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. అతీక్ అహ్మద్ ను హత్య చేయటానికి ఎప్పుడో కుట్ర జరిగింది. రెండు రోజుల నుంచి ప్రయాగ్ రాజ్ లోనే కాపు కాసి.. అతీక్, అష్రఫ్ లను జైలుకు తరలిస్తున్న సమయంలో హత్య చేశారు.
హత్యకు వినియోగించిన తుపాకీ టర్కీ దేశంలోని సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వాడే జిగాన అనే రకానికి చెందినదని పోలీసులు గుర్తించారు. టర్కీలోని టిపాస్ అనే కంపెనీ తయారు చేసిన సెమీ ఆటోమేటెడ్ తుపాకీ ఇది. ఓపెన్ మార్కెట్లో కొనాలంటే దీని ఖరీదు 6 లక్షలు కాగా.. భారత్ లో ఈ తుపాకులపై నిషేధం ఉన్నందున బ్లాక్ మార్కెట్లో దీని ధర కనీసం 10 లక్షలు ఉంటుందట. కూలీ పని చేసుకునే హంతకులకు ఇంత ఖరీదైన తుపాకీ ఎక్కడిదనేది సమాధానం లేని ప్రశ్న. అయితే.. ఈ తుపాకులకు పాకిస్తాన్ లోని కొన్ని ఆయుధ కంపెనీలు నకిలీ తుపాకులను తయారు చేస్తాయి. ఇవి ఒరిజినల్ తుపాకులకు ఏమాత్రం తీసిపోని విధంగా పనిచేస్తాయి. బహుశా హంతకులు వాడిన తుపాకీ పాకిస్తాన్ నుంచి వచ్చిందే అయి ఉండాలి. అయితే.. పాకిస్తాన్ నుంచి ఈ జిగాన తుపాకీని ఎవరు తెప్పించి హంతకులకు ఇచ్చారు.. వీరిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి.