శాంతి ఒప్పందం విషయంలో తన వైఖరి మార్చుకోని ఇరాన్కు ట్రంప్ భారీ వార్నింగ్ ఇచ్చాడు. ఈ రాత్రి నరకాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఇరాన్ పాలకులను హెచ్చరించాడు ట్రంప్. “ఈ రాత్రికి మా దాడులు ఎలా ఉంటాయో ఇరానీయన్లు చూస్తారు.. అనుభవిస్తారు.. ఈ రాత్రికి ఇరాన్ దేశం నరకం చూస్తుంది” అంటూ హెచ్చరించాడు. ఇరాన్ ప్రధాన చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని ఇతర విద్యుత్ ప్లాంట్లను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. రెండు రోజులుగా జరుగుతున్న ప్రతీకార దాడులతో మళ్లీ భీకర యుద్ధం దిశగా వెళుతుంది. కువైట్, ఒమెన్, ఇరాక్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల తర్వాత.. ట్రంప్ ఈ వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు కలకలం రేపుతోంది. గురువారం రాత్రి జూన్ 11 తెల్లవారే లోపు ఇరాన్ ను మరో వెనిజులాగా మార్చేస్తానంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ మిడిల్ ఈస్ట్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.
“ఈ రాత్రి ఇరాన్పై అమెరికా అత్యంత తీవ్రమైన దాడి చేయబోతోంది.. ఇప్పటికే అమెరికాకు చెందిన దళాలు ఇరాన్ను చుట్టుముట్టేశాయి.. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్, యాంటీ మిస్సైల్ వ్యవస్థలతోపాటు అన్ని ఇతర రక్షణ వ్యవస్థలు నాశనమయ్యాయి. త్వరలో మేం ఖార్గ్ ద్వీపాన్ని, చమురు కేంద్రాలను స్వాధీనం చేసుకుంటాం.. ఇరాన్ చమురు ,గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణను సాధిస్తాం.. వెనిజులా విషయంలో మేం చేసినట్లే ఇది కూడా జరుగుతుంది. ఇది వెనిజులా అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండింటికీ అద్భుతంగా కలిసి వస్తోంది. ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు.’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశాడు. అణ్వాయుధ దేశంగా మారాలని దశాబ్ధాలుగా ప్రయత్నిస్తున్న ఇరాన్ను.. ఎన్నటికీ అణ్వాయుధ దేశంగా మారనీయకుండా అమెరికా అడ్డుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా ఇరాన్.. తమ వద్ద ఉన్న యురేనియంతో పాటు న్యూక్లియర్ వెపన్ తయారు చేయటానికి కావాల్సిన పదార్థాలను అమెరికాకు అప్పగిస్తే.. యుద్ధాన్ని ఆపటానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు. కానీ.. శాంతి ఒప్పందానికి సిద్ధం అంటూనే.. ఇరాన్ మళ్ళీ అణ్వాయుధాలను వదిలే ఆలోచన చేయటం లేదు. ఈ రాత్రి ఏం జరగబోతోందోనని ప్రపంచం గమనిస్తోంది.

