గుండెపోటుతో మృతి చెందిన నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో మరికొద్ది సేపట్లో పూర్తి కానున్నాయి. అభిమానులం సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన తారకరత్న పార్థివ దేహాన్ని మహాప్రస్థానంకు తరలించారు. తారకరత్న బంధువులతో పాటు చంద్రబాబు కూడా పార్థివదేహంతో పాటు మహాప్రస్థానంకు బయల్దేరాడు. నందమూరి కుటుంబ సభ్యులంతా మహాప్రస్థానానికి పయనమయ్యారు. నిన్నటి నుంచి తారకరత్నను కడసారి చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ ల బాధ చూసిన అభిమానులు చలించిపోయారు. తారకరత్న భార్యను చూసిన అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. సినీ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తారకరత్న అంత్యక్రియలకు హాజరయ్యారు.
సరిగ్గా 23 రోజుల క్రితం కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. కుప్పంలోని స్థానిక హాస్పిటల్లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందజేశారు. విదేశీ వైద్య నిపుణులు ఇన్ని రోజులు కష్టపడినా తారకరత్న ప్రాణం నిలవలేదు. గుండె పనిచేయకపోవటంతో రక్తసరఫరా లేక మెదడు పనిచేయటం మానేయటం.. ఆ తర్వాత కిడ్నీలు పనిచేయటం మానేయటం జరిగిందని వైద్యులు చెప్పారు. చివరికి శివరాత్రి రోజున తారకరత్న తుదిశ్వాస విడిచారు.