సర్జికల్ స్ట్రైక్స్ కు ఎలాంటి ఆధారాలు లేవనీ.. అది కేవలం బీజేపీ ప్రభుత్వం కల్పన మాత్రమేనంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. దిగ్విజయ్ సింగ్ వివాదాస్ఫద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. భారత సైన్యంపై పిచ్చి ప్రేలాపనలు పేలవద్దనీ.. ఇలాంటి వాటితో రాజకీయం చేసి ఓట్లు సంపాదించటం కాంగ్రెస్ కు అలవాటైందనీ బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల పట్ల ఊహించని విధంగా స్పందించాడు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమేననీ.. వాటితో తనకు సంబంధం లేదని చెప్పాడు రాహుల్. తనకు భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందనీ.. వారు చేసిన పని రుజువులు చూపించాల్సిన అవసరం వాళ్ళకు లేదనీ చెప్పాడు రాహుల్.
అయితే.. ఇదే రాహుల్ గాంధీ గతంలో దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలే చేశాడు. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని మోడీ చెప్పటంపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించిన రాహుల్.. సర్జికల్ స్ట్రైక్స్ కు రుజువేంటని ప్రశ్నించాడు. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. బీజేపీ నేత ఒకరు.. రాహుల్ మీ తండ్రి రాజీవ్ అని చెప్పేందుకు రుజువు ఉందా అంటూ అభ్యంతరకరమైన విమర్శ చేయగా.. అది కూడా రాద్ధాంతంగా మారింది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన రాహుల్.. ఇప్పుడు మాట మార్చాడు. అయితే.. దిగ్విజయ్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఎప్పుడో ముగిసిన వివాదాన్ని మళ్ళీ రాజేసి కాంగ్రెస్ పార్టీని విమర్శల పాలు చేయవద్దని దిగ్విజయ్ కు అధిష్టానం చెప్పినట్టు సమాచారం.