ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 19న హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయానికి.. తెలంగాణ ప్రభుత్వానికిి సమాచారం వచ్చింది. జనవరి 19న హైదరాబాద్ లో మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించటం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. అలాగే జింఖానా గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ పర్యటన వాయిదా పడింది. కారణాలు ఏమిటనేవి మాత్రం ఇంకా తెలియరాలేదు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై స్పందించారు. మోడీ పర్యటన వాయిదా పడిందనీ.. కారణాలు వెల్లడించలేమనీ చెప్పిన ఆయన.. పర్యటన వాయిదా మాత్రమే పడిందనీ.. రద్దు కాలేదనీ చెప్పారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. మోడీ పర్యటనను తెలంగాణ బీజేపీ రాజకీయంగా క్యాష్ చేసుకోటానికి ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అటు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొననున్నారు.