సంక్రాంతి వచ్చిందంటే చాలు రాజధాని నగరం హైదరాబాద్ 90 శాతం ఖాళీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు వారి వారి సొంతూళ్ళకు వెళ్ళిపోగా.. తెలంగాణ జనాలు కూడా పండగకు ఇళ్ళకు పయనమవుతారు. దీంతో నగరం ఖాళీ అయిపోతుంది. చాలా మంది జనం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కావటం.. వారంతా పండగకు సొంతూళ్ళకు వెళ్ళటంతో సిటీ రోడ్లు ఖాళీగా దర్శనమిస్తాయి.. ఇళ్ళకు తాళాలు కనిపిస్తాయి. దొంగతనాలకు ఇదే మంచి చాన్స్ అని దొంగలు రాత్రికి రాత్రి ఇళ్ళు దోచే స్కెచ్చులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. ప్రతి యేటా జరిగే తంతే ఇది. ఈసారి కూడా దాదాపు సిటీ ఖాళీ అయిపోయింది. కాలనీలు నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో దొంగలకు మళ్ళీ చాన్స్ దొరికింది.
అందుకే పోలీసులు ఈ 5 రోజుల కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ రోజుల పాటు ఇంటిని వదిలి వెళ్ళే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. సొంతూళ్ళకు వెళ్ళే ముందు నగదు, నగలను బ్యాంకులో దాచుకొని వెళ్ళటం మంచిదనీ.. దొంగతనాలు జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటమే మేలని చెప్తున్నారు. ప్రతి కాలనీపైనా నిఘా వేసి ఉంచామని చెప్తున్నారు పోలీసులు. అయితే.. పోలీసులు ఎంత పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినా మన జాగ్రత్తలో మనం ఉంటేనే మంచిది.