ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్ పర్యటన మళ్ళీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ నెల 13న తెలంగాణలో పర్యటించటంతో పాటు హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అంతే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మోడీ ప్రారంభించాల్సి ఉంది. కానీ మోడీ పర్యటన రెండోసారి కూడా వాయిదాపడిందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల కారణంగానే మోడీ తన పర్యటన వాయిదా వేసుకొని ఉండవచ్చని అంచనా.
మరోవైపు అమిత్ షా తెలంగాణ పర్యటనపై కూడా స్పష్టత లేదు. ఈ నెల 11న తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారని చెప్పిన బీజేపీ.. మిగతా విషయాలను వెల్లడించలేదు. పర్యటనను ఖరారు చేయలేదు కూడా. ఫిబ్రవరి 11న అమిత్ షా తెలంగాణ వస్తారనీ.. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించటమే కాకుండా పార్లమెంట్ ప్రవాసీ యోజన కార్యక్రమంలో పాల్గొంటారని తెలంగాణ బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఈ విషయంపై మళ్ళీ స్పష్టమైన ప్రకటన రాలేదు.