భారత్ పట్ల ఎప్పుడూ విద్వేషాన్ని వెల్లగక్కే పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ నోట మొదటిసారి శాంతి మంత్రం వినిపించింది. భారత్ తో శతృత్వం ఇక తమ వల్ల కాదనీ.. స్నేహాన్ని కోరుకుంటున్నామనీ బహిరంగంగానే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసిన తర్వాత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇదే షరీఫ్.. తలతిక్క వ్యాఖ్యలు చేశాడు. తను ప్రధాన మంత్రిగా దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తాననీ.. అలాగే పాక్ చిరకాల స్వప్నమైన కశ్మీర్ యాపిల్ ను తాను సాకారం చేస్తాననీ వ్యాఖ్యానించాడు. అప్పటి నుంచి పాకిస్తాన్ లో ఆకలి అల్లకల్లోలం సృష్టించింది. కరువు విలయ తాండవం చేసింది. పెట్రోల్, గ్యాస్ కోసం క్యూలో నిలబడటం.. ఒక్క గోధుమ రొట్టె కోసం తుపాకీకి ఎదురెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుకోసం ఏ గడప తొక్కినా నిరాశ ఎదురుకావటంతో ఇక పాకిస్తాన్ కు భారత్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. చివరకు భారత్ ముందు మోకాళ్ళపై నిలుచోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ దేశ ప్రధాన మంత్రికి.
ఓ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ తో మూడు యుద్ధాలు చేసిన తర్వాత గానీ తమకు గుణపాఠం రాలేదంటూ వ్యాఖ్యానించాడు. భారత్ తో శతృత్వం వల్ల తమకు మిగిలింది పేదరికం, ఆకలి తప్ప ఇంకేం లేదనీ.. భారత నాయకత్వం ప్రస్తుతం తమతో స్నేహం గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్ పాకిస్తాన్ చర్చలు జరిపితే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. యుద్ధం వల్ల బాంబులు, బుల్లెట్లు వృధా అవుతాయే తప్ప పాకిస్తాన్ కు ఒరిగేది ఏమీ లేదన్నాడు. పాక్ కు సాయం చేయటానికి ఏ దేశమూ ముందుకు రాకపోవటమో.. లేక మరోటో తెలియదు గానీ.. షరీఫ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.