సోమవారం ఉదయం సంభవించిన భూకంపంతో అల్లకల్లోలంగా మారిన టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో రెండోసారి మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 7.6గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం వల్ల సుమారు 7 వందల మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని భావించగా.. వేలాది మంది శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారు. ఈక్రమంలో రెండోసారి సంభవించిన భూకంపం పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. రెండోసారి సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది భవనాలు కుప్పకూలగా.. అప్పటికే దెబ్బతిని ఉన్న భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో ఆయా శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే అవకాశమే లేకుండ పోయిన దీన స్థితి నెలకొంది. రెండోసారి సంభవించిన భూకంపం వల్ల రెండు దేశాల్లో కలిపి సుమారు 15 వందల మంది ప్రాణాలు కోల్పోయారని.. గాయపడిన వారి సంఖ్య అప్పుడే చెప్పలేమనీ అంటున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే క్రమంలో రెండోసారి భూకంపం సంభవించటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ తరచుగా స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తూనే ఉండటం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ప్రజలంతా రోడ్లపై ప్రాణాలు అరచేత పట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల నుంచి ఆర్మీ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. భారత్ నుంచి టర్కీకి అవసరమైన సాయాన్ని ఇప్పటికే ప్రధాని మోడీ ప్రకటించారు.