దేశాన్ని కుదిపేస్తున్న అదానీ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. అదానీ వ్యవహారం గురించి బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదని చెప్పిన ఆయన.. ఈ విషయంలో తాము దాచాల్సింది కూడా ఏమీ లేదంటూ సూటిగా చెప్పేశారు. ప్రస్తుతం అదానీ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదనీ.. ఇలాంటి సమయంలో మంత్రిగా అదానీ వ్యవహారంపై మాట్లాడటం తగదనీ చెప్పిన ఆయన.. ఏ తప్పు ఉన్నా కోర్టు తేల్చుకుంది అంటూ సమాధానం చెప్పారు. “కోర్టులు ఉన్నది నిజాలు నిగ్గు తేల్చటానికే కదా.. మేం కోర్టు దగ్గర ఏమీ దాచలేదు.. దీనిపై ఎలాంటి విచారణ చేయాలని కోర్టు నిర్ణయించుకున్నా మేం దాన్ని ఆపలేం కదా.. కోర్టులను ఆపే శక్తి ప్రభుత్వాలకు ఉండనప్పుడు.. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు..” అంటూ క్లారిటీ ఇచ్చారు.
“కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఆ కుంభకోణాల్లో కాంగ్రెస్ నాయకుల పాత్ర స్పష్టంగా బయటపడింది. ఇప్పుడు కూడా అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్ళొచ్చు. మాకేమీ భయం లేదు. పెగాసస్ విషయంలో కూడా కాంగ్రెస్ అదే పని చేసింది.. కానీ బెడిసికొట్టింది..” అంటూ కాంగ్రెస్ నేతలకు క్లియర్ కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. అదానీ వ్యవహారంపై విచారణ కమిటీ వేసేందుకు సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన మరుసటి రోజే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.