భారత ప్రధాని మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా మోడీ పేరు మార్మోగిపోతోంది. ఎప్పుడూ జరగని విచిత్రమైన సన్నివేశాలు ఈ సందర్భంగా మనకు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జీ20 సదస్సు సందర్భంగా మోడీని ఆహ్వానించేందుకు వచ్చిన పాపువా న్యూ గినియా అధ్యక్షుడు జేమ్స్ మరాపే మోడీ పాదాలను తాకిన వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అచ్చంగా అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. మోడీ అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకలో పాల్గొన్న అమెరికన్ సింగర్ మేరీ మిలిబెన్.. మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నది. వేడుకలో జాతీయ గీతం ఆలపించిన అనంతరం మోడీ వద్దకు వచ్చి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పాపువా న్యూ గినియా దేశంలో మెజార్టీ జనం క్రిస్టియానిటీని ఆచరిస్తారు. జేమ్స్ మరాపే కూడా క్రైస్తవుడే.. అలాంటప్పుడు హిందువుల సాంప్రదాయమైన పాదాలకు నమస్కరించటం ఏమిటని మరాపేపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో.. తాను మతపరంగా క్రైస్తవుడిని అయినా.. హిందూ మతానికి, భారత ప్రధానమంత్రి మోడీకి అభిమానిని అంటూ సమాధానం చెప్పాడు మరాపే. ఇప్పుడు అమెరికాలో మోడీ కాళ్ళకు నమస్కరించిన సింగర్ మేరీ మిలిబెన్ కూడా క్రైస్తవ మతానికి చెందినామే. కానీ.. భారత దేశం అన్నా.. భారతీయుల ఆచార వ్యవహారాలన్నా ఈమెకు మక్కువ ఎక్కువ. గతంలోనే భారత జాతీయ గీతాన్ని ఆలపించి భారతీయులను ఆకట్టుకుంది. అమెరికా అధ్యక్షుడి ముందు అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించటం ఎంత గౌరవంగా భావిస్తానో.. మోడీ ముందు భారత జాతీయ గీతాన్ని ఆలపించటాన్ని కూడా అంతే గౌరవంగా తాను భావిస్తాననీ.. మోడీని కలవటం మరిచిపోలేని సంఘటన అని చెప్పింది. మేరీ మోడీ పాదాలను తాకిన వీడియోను అమెరికాలోని వార్తా సంస్థలు ట్వీట్ చేయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో.