అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. దీనిపై చర్చించాల్సిందేనంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు రాద్ధాంతం చేయటంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితి నెలకొనగా.. చివరికి చేసేదేమీ లేక.. ఇరు సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. కాంగ్రెస్ సభ్యులు హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలంటూ పట్టుబట్టారు. విపక్షాలు కూడా ఏకమై రాద్ధాంతం చేయటంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్న స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితి అలాగే కొనసాగింది. అదానీ-హిండెన్ బర్గ్ అంశంపై చర్చించాల్సిందే అంటూ విపక్షాలు మళ్లీ ఆందోళన చేపట్టాయి. ఎంత సేపటికీ పరిస్థితి సద్దుమణగకపోవటంతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్ పై చర్చించాల్సి ఉండగా.. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.