దేశవ్యాప్తంగా టమాటో ధరలు ఎన్నడూ లేనంత స్థాయిలో విపరీతంగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. కర్ణాటకలోని కొన్ని మార్కెట్లలో టమాటో ధర ఆల్ టైమ్ హయ్యెస్ట్ గా కిలోకు 160 రూపాయల వరకూ పెరిగింది. లీటర్ పెట్రోల్ కంటే నలభై రూపాయలు ఎక్కువగా కిలో టమాటోల ధర ఉంది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో టమాటో పంటను కాపాడుకోటానికి ఎర్రచందనం తోటకు వేసినట్టు కంచె వేసి రాత్రి వేళ పహారా కాయాల్సి వస్తోంది కొన్ని రాష్ట్రాల్లో. కర్ణాటకలో ఓ టమాటో తోటను రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దోచేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన పంటను ఎవరో కోసుకెళ్ళారంటూ ఆ తోట యజమాని పోలీసులకు కంప్లైంట్ చేయగా.. ప్రస్తుతం ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. దోపిడీకి గురైన టమాటోల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 2.5 లక్షలు. ఒక్క కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చేతికొచ్చిన పంటను ఎవరు దోచేస్తారో తెలియక.. రైతులు రాత్రంతా తోటలకు కాపలా కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఎర్ర చందనం తోటలకు హైలెవెల్ సెక్యూరిటీ పెట్టుకోవటం మనకు తెలిసిందే. ఒక్క దుంగ ఖరీదు మార్కెట్లో కొన్ని లక్షలు ఉంటుంది కాబట్టి ఎర్రచందనం తోటల చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, సీసీ కెమెరా సర్వైలెన్స్ తో పాటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళను హత్య చేసి ఎర్ర చందనం దుంగలను ఎత్తుకెళ్ళిన సంఘటనలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు టమాటో తోటలకు అలాంటి పరిస్థితే వచ్చింది. రాత్రంతా టమాటో తోటల్లో రైతులు తమ కుటుంబాలతో సహా కాపలా కాస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు రైతులను కొట్టి మరీ టమాటోలను కోసి ట్రక్ లో వేసుకొని వెళ్ళిపోయారు కొంత మంది. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఉన్నట్టే ఇప్పుడు చేతికొచ్చిన టమాటో తోటల చుట్టూ సెక్యూరిటీ కనిపిస్తోంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో.