భూకంపం.. మనిషి నియంత్రించలేని ప్రకృతి విపత్తుల్లో అత్యంత ఘోరమైన మరియు అత్యంత శక్తివంతమైన విపత్తు. ఒక దేశం లేదా ఒక ప్రాంతం దశాబ్ధాల పాటు సాధించిన అభివృద్ధిని.. యెన్నో లక్షల కోట్ల సంపదను క్షణాల్లో తుడిచిపెట్టేయగలదు. టర్కీలో జరిగిన ఈ విషాదం మనం చూస్తునే ఉన్నాం. మళ్ళీ టర్కీ మునుపటి పరిస్థితికి రావటానికి ఎన్నేళ్ళు శ్రమించాలో. భారత్ లోని గుజరాత్ లో 2001 రిపబ్లిక్ డే నాడు సంభవించిన భూకంపం.. ఆ రాష్ట్రాలన్ని కనీసం 20 యేళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. మళ్ళీ కోలుకోటానికి గుజరాత్ కు చాలా కాలమే పట్టింది. ఇప్పుడు భారత దేశం ఇదే పెను విపత్తును మున్ముందు ఎదుర్కోవాల్సి ఉందంటున్నారు నిపుణులు.
టర్కీ భూకంపం గురించి ఫ్రాంక్ అనే సైంటిస్టు ముందుగానే ట్వీట్ ద్వారా హెచ్చరిక చేశాడు. త్వరలోనే సౌత్ సెంట్రల్ తుర్కియే, జోర్దాన్, సిరియా లెబెనాన్ కేంద్రంగా 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించే ఛాన్స్ ఉన్నట్టు ఆ ట్వీట్లో చెప్పారు. ఐతే, ఈ ట్వీట్ తర్వాత అతనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరి కొంతమంది అయితే ఎగతాళి చేశారు. ఎవ్వరూ ఫ్రాంక్ హెచ్చరికలను సీరియస్గా తీసుకోలేదు. కానీ, ఫ్రాంక్ ట్వీట్ చేసిన మూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 6న నిజంగానే తుర్కియే, సిరియాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఫ్రాంక్ హూగర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. చాలా దేశాల మీడియా సంస్థలు ఆయనతో ఇంటర్వ్యూలు చేయడం మొదలైంది. ఈ క్రమంలోనే భారత్లో భూకంపం వచ్చే అవకాశముందా అని ఫ్రాంక్ను ఇండియా టూడే క్వశ్చన్ చేసింది. ఈ ప్రశ్నకు డచ్ సైంటిస్ట్ ఇచ్చిన సమాధానమే ఇప్పుడు కోట్లాది మంది భారతీయులను టెన్షన్ పెడుతోంది.
తుర్కియే, సిరియా భూకంపాన్ని ముందే పసిగట్టిన ఫ్రాంక్.. భారత్లోనూ ఇదే తరహా భూకంపం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఒక్క భారత్ మాత్రమే కాదు మన పొరుగు దేశాలైన అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, చైనా ప్రాంతంలో కూడా భారీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. 2001లో వేల మందిని పొట్టన పెట్టుకున్న గుజరాత్ భూకంపం ఇంకా కళ్లముందే కదలాడుతోంది. 2001కచ్ భూకంపం దేశంలో మూడో అతిపెద్దది. ఈ విధ్వంసంలో వేల మంది మరణించారు. లక్షా 67 వేలమందికిపైగా ప్రజలు గాయపడ్డారు. ఇప్పుడు ఫ్రాంక్ అంచనాలు ఆనాటి భూప్రళయానికి ఏమాత్రం తీసిపోని భూకంపం మళ్లీ రావచ్చనేవే. ఐతే, ఇది ఛాన్స్ మాత్రమేననీ.. ఇందులో ఖచ్చితత్వం లేదంటున్నారు. భారత ప్రభుత్వం తనను సంప్రదిస్తే.. తన దగ్గరున్న వివరాలను పంచుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానన్నారు. ఐతే, ఫ్రాంక్ ఒక్కరే కాదు.. భారత్కు భారీ భూకంప ముప్పు పొంచి ఉందన్న అంచనాలు ఇప్పటికే చాలా మంది సైంటిస్టుల నుంచి వినిపించాయి. భారత్తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనాలకూ భూకంప ముప్పు ఉందన్న హెచ్చరిక ఫ్రాంక్ నోటిమాటగా చెప్పింది కూడా కాదు.. ఈ దేశాలకు భూకంపం ముప్పు ఉందనడానికి అసలు కారణం వేరే ఉంది.
హిమాలయాస్.. ఇక్కడ భూమి కంపిస్తే ఏం జరుగుతుందో తెల్సా? 8లక్షల మంది.. అక్షరాలా
8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. హిమాలయాలు కంపిస్తే భారత్తో పాటు పొరుగు దేశాల పునాదులు కూడా కదిలి పోతాయి. భూకంపం రావడానికి అసలుకారణం టెక్టానిక్ ప్లేట్ల మధ్య కదలికలే.. గతకొన్నేళ్లుగా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ మధ్య ఘర్షణ తీవ్రమవుతుందని పరిశోధనల్లో తేలింది. టిబెట్ పీఠభూమి ఎత్తును కొనసాగిస్తూ.. భారత ప్లేట్ ఏడాదికి 47 మిల్లీమీటర్ల చొప్పున కదులుతోంది. ఇది హిమాలయ, ఆల్టిన్ టాగ్, టియన్ షాన్ పర్వతాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని కారణంగా హిమాలయాల ఎత్తు పెరగడంతో పాటూ చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తున్నాయి. అవి తీవ్రమైతే ఏర్పడే భూకంపాన్ని తట్టు కోవడం అసాధ్యం. బహుశా డచ్ సైంటిస్ట్ ఫ్రాంక్ హూగర్ బీట్స్ కూడా తన రీసెర్చ్లో ఇదే తెలుసుకుని ఉండొచ్చు. అందుకే భారత ప్రభుత్వం అనుమతిస్తే తన దగ్గరున్న వివరాలు అందిస్తానని చెప్పి ఉంటారనే చర్చ జరుగుతోంది.
ఒకవేళ హిమాలయ పర్వత శిఖరాల్లో సంభవించే భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 8 పాయింట్లు నమోదైతే కనుక సుమారు 8 లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనేది ఎక్స్పర్ట్స్ అంచనా. హిమాచల్ప్రదేశ్ మండిలో భూకంపం సంభవిస్తే చండిఘర్లో 20 వేల మంది ప్రాణలకు ముప్పు ఏర్పడుతుందట. హిమాలయ పర్వత శ్రేణులకు ఆనుకుని ఉండే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణచల్ ప్రదేశ్ వరకూ గత 53 సంవత్సరాల్లో భూకంప తీవ్రత చాలా ఉధృతంగా ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఆ తీవ్రత పెరిగి భూమి కదిలితే 1950 తర్వాత ఇదే అతిపెద్ద భూప్రళయంగా మిగులుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో 1950లో భారత్-చైనా సరిహద్దులో 8.6 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన భూకంపమే అతిపెద్దదని రికార్డులు చెబుతున్నాయి. దీని భూకంప కేంద్రం భూమిలోపల 30 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, వరల్డ్ డేటా సర్వీస్ లెక్క ప్రకారం 1950 నుంచి 2021 మధ్య కాలంలో 71 సార్లు రిక్టర్ స్కేల్పై 3.8, ఆ పైస్థాయి తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇవి కాకుండా తక్కువ మ్యాగ్నిట్యూడ్తో వచ్చినవి వందల సంఖ్యలో ఉంటాయని భూగర్భ పరిశోధన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరోవైపు.. హిమాలయ పర్వతాల్లో అతిపెద్ద భూకంపం సంభవిస్తే.. దానికి తగ్గట్టుగా ప్రాథమిక
నష్టాన్ని అంచనా వేసుకుని ఏం చేయాలనే విషయమై జాతీయ విపత్తుల యాజమాన్య సంస్థ నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకుంది. భూకంపాల ప్రభావ తీవ్రతను తగ్గించడంపై అన్ని రాష్ట్రాలలోని జాతీయ విపత్తుల యాజమాన్య సంస్థలతో చర్చించుకుని పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నారు. భారత్లో జోన్-1 అనేది లేదు. అందువల్ల అన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించే ముప్పుంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. భూకంప ముప్పు తీవ్రత అంచనాల ఆధారంగా భారత్ను మొదట్లో ఐదు జోన్లుగా విభజించారు. 1993లో వచ్చిన కిల్లారి భూకంపం తర్వాత జోన్-1ను జాబితా నుంచి శాస్త్రవేత్తలు తొలగించారు. ప్రస్తుతం నాలుగు జోన్లు మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక సందర్భంలో భూకంపం వచ్చే ముప్పుంది. మ్యాగ్నిట్యూడ్ స్కేల్పై 1-4 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంటే జోన్-2 పరిధిలో ఉన్నట్లు పరిగణిస్తారు. మ్యాగ్నిట్యూడ్ స్కేల్పై 5తో భూకంపం వస్తే జోన్-3 కేటగిరీలో ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ 6,7తో వస్తే జోన్-4 పరిధిలో ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ 7కంటే ఎక్కువ తీవ్రతతో వస్తే జోన్-5లో ఉంటుంది. దీని ప్రకారం జోన్-5లోని ప్రాంతాలలో ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే.. వరల్డ్ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి భారత దేశంలో 20 కోట్ల మంది భూకంపాల ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తారని అంచనా. ఐతే, వాస్తవ లెక్కల ప్రకారం ఈ సంఖ్య 25-30 కోట్లకు చేరవచ్చని నిపుణులు చెబుతున్నమాట. గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయి ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏదేమైనా భారత్కూ భారీ భూకంప ముప్పుందన్న డచ్ సైంటిస్ట్ ఫ్రాంక్ హూగర్ బీట్స్ అంచనాలై యంత్రాంగం అలర్ట్ కావాల్సిన టైం వచ్చినట్టు కనిపిస్తోంది.