దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు బ్లాస్ట్ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసును విచారిస్తున్న ఎన్ఐఏ సమర్పించిన చార్జ్షీట్లో ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు కోర్టు ముందుంచారు. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో నిందితులుగా ఉన్న ఉగ్ర డాక్టర్లే లఖ్నవూలోని ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకునేందుకు కుట్ర పన్నారని చార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొంది. డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షహీన్ సయీద్ లఖ్నవూలో దాడికి కుట్రలో భాగంగా గతేడాది ఆగస్టులో నెలలో రెక్కీ నిర్వహించారు. ఏయే భవనాలను టార్గెట్ చేయాలి.. లాజిస్టిక్స్ అవకాశాలు ఎలా ఉన్నాయని వీరిద్దరూ పరిశీలించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. రెక్కీ చేసేందుకు ఫరీదాబాద్ నుంచి లఖ్నవూ వెళ్ళిన ఇద్దరూ.. బంధువుల ఇళ్ళలో ఉండి భారీ పేలుడు కోసం ప్లాన్ చేశారనీ.. ఎక్కువ మంది ప్రాణాలు పోవాలంటే భారీ బ్లాస్ట్ చేయాలనీ.. అందుకు సంబంధించిన అవసరమైన వస్తువులు సేకరించాలనీ వీరు ప్లాన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే ట్రైఅసిటోన్ ట్రైఫెరాక్సైడ్ అనే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాన్ని బ్లాస్ట్ లో ఉపయోగించాలని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత ఆ టీఏటీపీ అనే పేలుడు పదార్థం ఎక్కడ దొరుకుతుంది.. ఎంత మోతాదులో వాడితే ఎంత భారీ పేలుడు సంభవిస్తుంది.. ముడి పదార్థాన్ని పేలుడు పదార్థంగా ఎలా మార్చాలి అనే విషయాలపై కెమికల్ వ్యాపారులను అడిగి తెలుసుకున్నారనీ.. ఇంటర్నెట్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు వెతికి చేతులపై రాసుకొని ఇంటికెళ్ళి వివరంగా విశ్లేషించారనీ చెప్తున్నారు. ఈ ఇద్దరు డాక్టర్లు రెక్కీ చేసిన ఏరియాలో ప్రభుత్వ భవనాలు.. అధికారుల నివాస స్థలాలు ఉన్నాయనీ.. భద్రత ఏర్పాట్లు ఎక్కడ తక్కువ ఉంటాయన్న సమాచారాన్ని సేకరించి.. జనం ఎక్కువగా ఉండే స్థలంలో పేలుడు చేయాలనీ ప్లాన్ చేశారు. కారులో ఏ రూట్లో వెళ్తే ట్రాఫిక్ సమస్యలు ఉండవు.. ఎక్కడ పోలీసులు తనిఖీ చేసే అవకాశాలున్నాయి.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎంత జనం నిలబడవచ్చు.. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం బ్లాస్ట్ చేశారని అధికారులు చెప్తున్నారు. 2025 నవంబరు 10న ఎర్రకోటకు సమీపంలో కారు బాంబు పేలుడు ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన విషయం తెలిసిందే. దానికి ముందు ఈ రెక్కీ జరిగినట్లు తాజా ఛార్జిషీట్ ప్రకారం తెలుస్తోంది.
