మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకూ హైదరాబాద్ నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా నగర కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో లాల్ దర్వాజా బోనాలను తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకల సందర్భంగా ఎక్కడా ఏ అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా వైన్ షాపులను మూసివేస్తారు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 16, 17వ తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలీసులు ముందుగానే విషయం చెప్పటంతో మందుబాబులు జాగ్రత్తపడుతున్నారు.
వీకెంట్ హ్యాప్పీగా ఎంజాయ్ చేయటం కోసం ముందుగానే రెండు రోజులకు కావాల్సిన స్టాక్ కొనేస్తున్నారు. దీంతో వైన్ షాపులు కళకళలాడుతున్నాయి. మందుకు డిమాండ్ పెరగటాన్ని ముందే ఊహించిన వైన్ షాపు వాళ్ళు.. రకరకాల బ్రాండ్లను షాపుల్లో ఉంచుతున్నారు. ఎక్కువగా అమ్ముడుపోని మందు బాటిల్స్ అన్నీ ఇలాంటి టైమ్ లో స్టాక్ క్లియర్ చేసేస్తున్నారు. అసలు మందే దొరకదేమోనని భయంతో మందుబాబులు కూడా ఏది దొరికితే అదే తీసుకెళ్తున్నారు. రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరవ్యాప్తంగా బోనాలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చుతో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు నిర్వహిస్తుండగా.. లక్షల సంఖ్యలో భక్తులు రేపు అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు.