క్యాస్ట్ రిజర్వేషన్ల సిస్టమ్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయినప్పుడు.. వారి పిల్లలకు రిజర్వేషన్లు వర్తింపజేయటం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించింది. ఆర్థికంగా మరియు విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాలకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయటంపై మరోసారి ఆలోచించాలంటూ సూచించింది. వెనకబడిన తరగతుల్లోని సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వర్గాలకు (క్రీమీ లేయర్) రిజర్వేషన్ ప్రయోజనాలకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్పై విచారణ జరిగింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కురుబా సమాజానికి చెందిన ఒక అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఓబీసీ రిజర్వేషన్ కింద ఎంపికయ్యాడు. అయితే అతని కుటుంబం ‘క్రీమీ లేయర్’ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ జిల్లా కుల, ఆదాయ ధృవీకరణ కమిటీ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరించింది. అభ్యర్థి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని.. వారి వార్షిక ఆదాయం సుమారు రూ.19.48 లక్షలు ఉందని అధికారులు గుర్తించారు. దీంతో వారు క్రీమీ లేయర్లోకి వస్తారని కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ అభ్యర్థి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా ఆ అభ్యర్థికి చుక్కెదురు కావటంతో సుప్రీంకోర్టుకు వెళ్ళాడు.
ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగరత్న ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “రిజర్వేషన్ వల్ల తల్లిదండ్రులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు. మంచి ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు వారి పిల్లలు కూడా అదే రిజర్వేషన్ కోరుతున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
“తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులైతే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? విద్య, ఆర్థిక సాధికారతతో సామాజిక అభివృద్ధి వస్తుంది. అలాంటప్పుడు మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ కోరితే మనం ఎప్పటికీ దాని నుంచి బయటకు రాలేం” అని వ్యాఖ్యానించారు. అభ్యర్థి తరపు న్యాయవాది శశాంక్ రత్నూ వాదిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో క్రీమీ లేయర్ నిర్ణయానికి జీతం ఒక్కటే ప్రమాణం కాదన్నారు. తల్లిదండ్రులు గ్రూప్-A లేదా గ్రూప్-B సేవల్లో ఉన్నారా అన్నదే ప్రధాన ప్రమాణమని తెలిపారు. కేవలం జీతాన్ని ప్రమాణంగా తీసుకుంటే డ్రైవర్లు, క్లర్కులు, ప్యూన్లు కూడా రిజర్వేషన్ కోల్పోతారని వాదించారు. జీతం, వ్యవసాయ ఆదాయాన్ని క్రీమీ లేయర్ లెక్కల్లో పరిగణించరాదని.. వ్యాపారాలు లేదా ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూడాలని పేర్కొన్నారు. లేదంటే ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మధ్య తేడా లేకుండా పోతుందని తెలిపారు. అయితే అభ్యర్థి తరపు న్యాయవాది వాదనలను ధర్మాసనం తీవ్రంగా తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు కూడా రిజర్వేషన్ల ద్వారా సామాజిక, ఆర్థిక సాధికారిత పొందిన తర్వాత తమ కుటుంబంలోని తర్వాతి తరానికి అదే రిజర్వేషన్ పొందే విషయంలో ఎవరికి వారు మరోసారి ఆలోచించుకోవాలంటూ అభిప్రాయపడింది.
