తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు. ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్ళి మహిళా కమిషన్ ముందు హాజరైన కౌశిక్ రెడ్డి గవర్నర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైపై కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో మాట్లాడాడు. ప్రభుత్వం రూపొందించిన బిల్లుల గవర్నర్ ఆమోదం విషయంలో కౌశిక్ రెడ్డి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇచ్చుకోవాలంటూ నోటీసులు పంపింది.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పాత వివాదాలను ఎన్నికల దాకా మోసుకుపోవద్దన్న పెద్దల సలహాతోనే కౌశిక్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి క్షమాపణ చెప్పాడని సమాచారం. గవర్నర్ తమిళిసైకి కూడా క్షమాపణలు చెప్తూ లేఖ రాస్తానని మహిళా కమిషన్ ముందు రాతపూర్వకంగా కౌశిక్ రెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ కౌశిక్ రెడ్డికే అన్నది మొన్నటి కేటీఆర్ వ్యాఖ్యలతో తేలిపోయింది. ఇక ఈటెల రాజేందర్ పై పోటీకి సిద్ధమవుతున్న వేళ.. వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిదని పార్టీ పెద్దలు కౌశిక్ రెడ్డికి సలహా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలోనే తెలంగాణ ప్రభుత్వానికీ, గవర్నర్ కు మధ్య అంతరం ఏర్పడి.. అది పెద్ద గాలిదుమారంగా మారి.. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య భారీ గ్యాప్ రావటానికి కారణమైంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి క్షమాపణతో ఆ వివాదం కాస్త సద్దుమణుగుతుందేమో చూడాలి.