కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నల్గొండలోని ఇటుకలపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీఆర్ఎస్ నేతలు కుర్చీలు, కర్రలు కోమటిరెడ్డిపైకి విసిరారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కోమటిరెడ్డిపై దాడి జరిగినా ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన అనుచరులు సురక్షితంగా కోమటిరెడ్డిని అక్కడి నుంచి తరలించారు. విషయం తెలిసి రంగప్రవేశం చేసిన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. సుమారు 2 గంటల పాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారందరిపైనా ఇలాగే దాడులు చేస్తారా అంటూ కోమటిరెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
నిన్న ఢిల్లీలో కోమటిరెడ్డి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని జోష్యం చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇటు బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదంటూ ఇరు పార్టీల అగ్రనాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలతో పాటు టీపీసీసీలో అలజడి రేకెత్తించిన కోమటిరెడ్డి.. హైదరాబాద్ రాగానే మాట మార్చి తాను అలా అనలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరిగిన మర్నాడే కోమటిరెడ్డిపై దాడి జరగటం గమనార్హం.