మార్బర్గ్.. ఈ మాటను మార్క్ చేసిపెట్టుకోవాల్సిన టైం వచ్చింది. ఇదే సీజనల్గా వచ్చే వైరల్ ఫీవర్ కాదు.. 14 రోజులు క్వారెంటైన్లో గడిపేస్తే బయటపడిపోయే కరోనా కూడా కాదు.. డేంజరస్ ఎబోలా ను మించిన డెడ్లీ వైరస్. ఒక్కసారి మన శరీరంలోకి ఎంట్రీ ఇస్తే 21 రోజులపాటు జీవించి ఉంటూ మనల్ని జీవశ్చవంగా మార్చేసే మహమ్మారి. ఈ వ్యాధి సోకిన వారిలో 88శాతం మరణాల రేటు ఉందంటే ఇదెంత కంత్రీ వైరసో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా.. ఈ మహమ్మారి ఎంట్రీ మరోసారి ఆఫ్రికాలోనే జరిగింది. ఆఫ్రికన్ కంట్రీ ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ కారణంగా పదిమంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం రంగంలోకి దిగింది. అనుమానితులు, క్లోజ్ కాంటాక్ట్లను ఐసోలేషన్కి తరలించి పరీక్షలు షురూ చేసింది. మార్బర్గ్ దెబ్బకు గినియాలోని ఓ ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచాల్సిన పరిస్థితులు వచ్చాయి.
మార్బర్గ్ కలకలంతో ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలో దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో అనుమానిత కేసులను పరిశీలిస్తున్నట్లు గినియా ప్రభుత్వం గత వారం ప్రకటించింది. ఐతే, ముగ్గురి వ్యక్తుల్లో మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితితో చర్చల అనంతరం ఆ ప్రావిన్స్లో లాక్డౌన్ అమలు చేశారు. కీ-ఎన్టెమ్ ప్రావిన్స్, పొరుగు జిల్లా మొంగోమోలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించబడిందని ఆరోగ్య మంత్రి మితోహా ఒండో అయేకాబా విలేకరుల సమావేశంలో చెప్పారు. కీ-ఎన్టెమ్ ప్రావిన్స్లో 4వేల 325 మందిని ఈ వైరస్ ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. వారందరిని క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 మధ్య తొమ్మిది మరణాలు సంభవించాయని, ఫిబ్రవరి 10న ఆసుపత్రిలో అనుమానాస్పద మరణం కూడా మార్బర్గ్ మరణమే అని తేలింది. దీంతో ఈ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అక్కడి ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నిజానికి.. మార్బర్గ్ అనేది ఎబోలా ఫ్యామిలీకి చెందిన అంటువ్యాధి. ఇది గబ్బిలాల ద్వారా వ్యాప్తిస్తుంది. వాటి నుంచే మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాకినప్పుడు, దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ 2 నుంచి 21 రోజుల వరకూ బాధిత శరీరంలో సజీవంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 88 శాతం మరణాల రేటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మార్బర్గ్ వైరస్ ఫిలోవైరస్ కుటుంబంలో భాగం. ఇందులో ఎబోలా వైరస్ కూడా ఉంది. ఎబోలా ఆఫ్రికాలో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రపంచం మొత్తం చూసింది. దీంతో మార్బర్గ్ వ్యాప్తి ఆఫ్రికాను మరోసారి కలవర పరుస్తోంది. మార్బర్గ్ సోకిన వ్యక్తికి దాదాపుగా ఎబోలాలో కనిపించిన లక్షణాలే కనిపిస్తున్నాయి.
జ్వరంతోపాటూ తలనొప్పి, తీవ్రమైన అస్వస్థత ఏర్పడుతున్నాయి. చాలా మందికి వైరస్ సోకిన వారం తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదట్లో టైపాయిడ్, మలేరియాలా కనిపిస్తుంది. తర్వాత ఇది మార్బర్గ్ అని అర్థమవుతుంది. ఐతే, అప్పటికే బాధితుడికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్బర్గ్ను వీలైనంత త్వరగా గుర్తించాలనే ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు.. మార్బర్గ్ అనేది కొత్త వ్యాధి కాదు. ఇదివరకు అంగోలా, డీఆర్ కాంగో, గినియా, కెన్యా, సౌత్ ఆఫ్రికా, ఘనా, ఉగాండాలో కూడా ఇది సోకింది. గతేడాది జులైలో ఘనాలో ఇది సోకింది. మరణాలు సంభవించాయి. ఐతే గతేడాది సెప్టెంబర్ నాటికి ఇది ముగిసినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. కానీ, ఇప్పుడు గినియాలో మళ్లీ మార్బర్గ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాధి సోకుతున్న ప్రాంతాల్లో WHO.. ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపింది. మరింత మందికి ఇది సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దాదాపు 500 మంది హెల్త్ వర్కర్లకు పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్లను ఇచ్చింది. ప్రస్తుతం ఈ వైరస్ కంట్రోల్లోనే ఉందని చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మార్బర్గ్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. ఎక్కువ నీరు తాగితే బతికే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్లడ్ ప్రొడక్ట్స్, ఇమ్యూన్ థెరపీలు, డ్రగ్ థెరపీల వంటి ట్రీట్మెంట్స్తో నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక.. ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఫ్రూట్ బ్యాట్స్.. ఆఫ్రికాలో ఓ రకమైన గబ్బిలాలే ఈ ఫ్రూట్ బ్యాట్స్. వీటి నుంచే మనుషులకు సోకుతోంది.
ఎబోలా, నిఫా, సార్స్, మెర్స్, హెండ్రా.. ఇప్పుడు మార్బర్గ్ ఈ వ్యాధులన్నీ వ్యాప్తి చెందేవి గబ్బిలాల నుంచే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 13వందల జాతుల గబ్బిలాలు ఉన్నాయి. ఒక్క భారత్లోనే 128 జాతులున్నట్టు అంచనా. ఐతే, ఇవన్నీ ప్రాణాంతక వైరస్లు మనుషులపైకి వదిలే గబ్బిలాలు కాదు.. ఓ రకంగా చెప్పాలంటే గబ్బిలాలు లేకపోయినా మన జీవితాలు సాఫీగా సాగవు. గబ్బిలాలు పురుగుల్ని తినడం వల్ల ఒక్క భారత్లోనే ఏటా 2వేల 900 టన్నుల ధాన్యం
సేవ్ అవుతోంది. ఈ గబ్బిలాలే లేకపోతే ప్రపంచానికి తిండిగింజలు కరువయ్యే పరిస్థితులుకూడా రావచ్చట. కానీ, వీటిలో కొన్ని జాతుల గబ్బిలాలు మాత్రం భయంకరమైన వైరస్లకు కారణం అవుతున్నాయి. ఇదే సమయంలో ఆ వైరస్లన్నీ మనుషులకే కానీ గబ్బిలాలకు ప్రమాదకరంగా మారడం లేదు. దీనికి కారణం గబ్బిలాల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటమే అంటున్నారు శాస్త్రవేత్తలు. గబ్బిలాలు నిత్యం ఎగురు తుండటం వల్ల వాటి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఓక థియరీ చెబుతోంది. ఎప్పుడూ ఎగురుతుండటం వల్ల దాని శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని ఆ సమయంలో వాటికి వైరస్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు.. ఎబోలా, మార్బర్గ్ లాంటి వైరస్లను ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం. గబ్బిలా లకు దూరంగా ఉండడమే. గబ్బిలాలకు దూరంగా ఉండడంతో పాటు అడవుల్లో సేకరించిన ఆహార ఉత్పత్తు లను శుభ్రం చేసి తినడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గబ్బిలాలను అంతం చేయడం అసాధ్యం.. జాగ్రత్తలు మాత్రమే మనల్ని కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు. ఏదే మైనా మార్బర్గ్ లాంటి మహమ్మారుల పట్ల అప్రమత్తంగా ఉండకుంటే కరోనాను మించిన కల్లోలాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు.