దర్శకుడు కే.విశ్వనాథ్ అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితమే పంజాగుట్ట స్మశాన వాటికలో ముగిశాయి. పంజాగుట్ట వరకు సాగిన ఆయన అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులంతా వారి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
గురువారం రాత్రి విశ్వనాథ్ తీవ్ర అనారోగ్యానికి లోను కావటంతో ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. 1930 ఫిబ్రవరి 19న బాపట్లలోని రేపల్లెలో కాశీనాథుని సుబ్రమణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. 1965లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకత్వ ప్రస్థానం ప్రారంభించిన విశ్వనాథ్.. 50 యేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. కళా ప్రాధాన్య కథలతో అత్యంత హృద్యంగా సున్నితమైన భావాలను కళ్ళకు కట్టినట్టు సీన్లను రక్తి కట్టించటంలో విశ్వనాథ్ సిద్ధహస్తులు. 50 సినిమాలకు పైగా తెరకెక్కించిన విశ్వనాథ్ కు సౌత్ ఇండియన్ సినిమా డైరెక్టర్లంతా ఏకలవ్య శిష్యులలాంటి వారే. ఎంతో మంది డైరెక్టర్లకు మార్గదర్శకుడిగా నిలిచిన విశ్వనాథ్.. తన ప్రస్థానాన్ని ముగించారు. కొత్త సంవత్సరంలో ఇప్పటికే పలువురు పాతతరం సినీ దిగ్గజాలను కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ.. మరో దిగ్గజాన్ని కోల్పోయింది.